హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సీనియర్ల దెబ్బకు రేవంత్రెడ్డి వర్గం రాజీనామాల బాట పట్టింది. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన 12 మంది నేతలు పార్టీలోని కమిటీల్లో తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రేవంత్రెడ్డి వర్గం పై అసమ్మతి సీనియర్ల వర్గం పైచేయి సాధించినట్లయింది. ఇటీవల కాంగ్రెస్లో పలు కమిటీలను నియమించారు. వీటిల్లో సీనియర్లకు, పార్టీ సేవకులకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతర పా ర్టీల నుంచి వచ్చిన వారికి, జూనియర్లకు చోటు కల్పించారంటూ సీనియర్లు ఆరోపించారు. శనివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో సమావేశమై ఈ కమిటీల తీరుపై చర్చించారు. ఈ సందర్భంగా వాళ్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన పార్టీని నాశనం చేయడానికే వచ్చారంటూ ఆరోపించారు. టీడీపీ నుంచి వలస వచ్చిన వారికే ఎక్కువ పదవులు ఇచ్చారని, సొంత పార్టీ నేతలకు అన్యాయం చేశారని విమర్శించారు. ఈ ఆరోపణలు పార్టీలో పెద్దఎత్తున చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో రేవంత్రెడ్డి వర్గం డిఫెన్స్లో పడినట్టు తెలిసింది. రేవంత్రెడ్డి కూడా ఈ విషయంలో డీలా పడినట్టు సమాచారం. ఆయన తన వర్గం నేతలను కమిటీలకు రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది. రేవంత్ ఆదేశాల మేరకు 12 మంది నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు.
సీనియర్ల డుమ్మా…
రేవంత్రెడ్డి వర్గం రాజీనామాలతో కొంత పైచేయి సాధించిన సీనియర్లు.. మరోవైపు తమ పంతం నెగ్గించుకున్నారు. రేవంత్రెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఇప్పటికే రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగే ఏ సమావేశానికి హాజరుకాబోమని ప్రకటించారు. ఇం దులో భాగంగానే సమావేశానికి సీనియర్లెవరూ హాజరు కాకపోవడం గమనార్హం.
కమిటీల ఏర్పాటుతో రెండుగా చీలిక
హస్తం పార్టీ అస్తవ్యస్తంగా మారింది. కమిటీల ఏర్పాటుతో మొదలైన చిచ్చు… పార్టీని రెండుగా చీల్చింది. వలస నేతలుగా, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలుగా విడిపోయారు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. రేవంత్రెడ్డి వర్గం ఒక వైపు, సీనియర్ల వర్గం మరోవైపుగా విడిపోయారు. పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీగౌడ్, కోదండరెడ్డి, జగ్గారెడ్డి, మహేశ్వర్రెడ్డి తదితరులు ఒక వర్గంగా ఏర్పడి రేవంత్రెడ్డిపై తిరుగుబాటు ప్రకటించారు. ఆయనతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. పార్టీకి వలస వచ్చిన ఆయన సొంత పార్టీ నేతల్నే కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని అధిష్ఠానం వద్దే తేల్చుకోవాలని నిర్ణయానికొచ్చినట్టు తెలిసింది. సీనియర్ నేతలంతా మరోసారి భేటీ కావాలని కూడా నిర్ణయించినట్టు సమాచారం. సేవ్ కాంగ్రెస్ పేరుతో రేవంత్రెడ్డి, ఆయన వర్గం నుంచి పార్టీని కాపాడాలని వారు నిర్ణయించినట్టు తెలిసింది.