Mega DSC | హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చేందుకు అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్.. తీరా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగానే వాటిని పూర్తిగా విస్మరించింది. నిరుద్యోగులను అస్త్రంగా చేసుకొని రాజకీయాలు చేసి.. ఇప్పుడేమో వారిని దారుణంగా మోసం చేసింది. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసే వారి నుంచి నయా పైసా ఫీజులు తీసుకోబోమని ఏకంగా అభయహస్తం మ్యానిఫెస్టోలో ఆ పార్టీ పొందుపరిచింది.
కానీ, ఈ హామీని పూర్తిగా పక్కనపెట్టేసింది. ఇటీవలే విడుదలైన గ్రూప్ -1, తాజాగా విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్లలో ఎక్కడా ఫీజు మినహాయింపు ఇవ్వలేదు. నిరుద్యోగుల భావోద్వేగాలను, వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడేమో ఇచ్చిన హామీల ఊసేలేకుండా నిరుద్యోగుల నుంచి ఫీజులు గుంజుతున్నది.
రేవంత్ సర్కారు తీరుపట్ల నిరుద్యోగ యువత మండిపడుతున్నది. తాము నమ్మి ఓట్లేస్తే తమను నట్టేటముంచారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. సీఎం సారు ఇదేంటని ప్రశ్నిస్తున్నది. ప్రజాపాలన అంటే ఇదేనా? అని నిలదీస్తున్నది. ఉద్యోగాల భర్తీయేమో గాని.. మా జేబులకు చిల్లులుపెడతారా అంటూ ప్రశ్నలవర్షం కురిపిస్తున్నది. తమను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెబుతామని హెచ్చరిస్తున్నది.
అభయహస్తం మ్యానిఫెస్టో (జాబ్ క్యాలెండర్) ఇలా…
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాలు కమిషన్ ద్వారా చేపట్టబడతాయి. దరఖాస్తుదారులు ఎవ్వరు ఒక రూపాయి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
వాస్తవంగా జరుగుతున్నది ఇలా..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. టీఎస్పీఎస్సీ ద్వారా 563 ఉద్యోగాల భర్తీకి గ్రూప్ -1 నోటిఫికేషన్ను విడుదల చేసింది. గ్రూప్ -1కు నిరుద్యోగులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 200, పరీక్ష ఫీజుగా రూ. 120 చెల్లించాలి.
డీఎస్సీ పోస్టుకు వెయ్యి ఫీజు
తాజాగా గురువారం 11,062 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేశారు. డీఎస్సీకి దరఖాస్తు చేసే అభ్యర్థులు వెయ్యి రూపాయలు ఫీజుగా చెల్లించాలని సూచించారు. ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేస్తే అభ్యర్థి అన్ని వేల రూపాయలు ఫీజుగా చెల్లించాలి.
ఉదాహరణకు – ఒక అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ గణితం, ఫిజికల్ సైన్స్ రెండు పోస్టులకు దరఖాస్తు చేస్తే రెండువేలు ఫీజుగా సమర్పించుకోవాల్సిందే. ఇలా అర్హత ఉండి ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేస్తే అన్ని వేలను చెల్లించాల్సిందే.
రద్దుచేస్తామని వెయ్యి తీసుకోవడం దారుణం
పరీక్ష ఫీజులను పూర్తిగా రద్దు చేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఇప్పుడా ఆ హామీని విస్మరించడం అత్యంత దారుణం. పైగా నిరుద్యోగుల నుంచి రూ.వెయ్యి వసూలు చేయడం సరికాదు. ప్రభుత్వం ఫీజులపై పునరాలోచించాలి. త్వరలో రిటైరయ్యే 4 వేల టీచర్ పోస్టులను కూడా డీఎస్సీలో జతచేయాలి. గ్రూప్ -1 తర్వాతే డీఎస్సీ పరీక్ష నిర్వహించాలి.
– రావుల రామ్మోహన్రెడ్డి, డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు