కొడంగల్/బొంరాస్పేట, జనవరి 27 : రేవంత్.. కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకొని వారు ఇచ్చిన అద్దాలు పెట్టుకొని చూస్తే.. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న కొడంగల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి కనిపిస్తదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. హాత్సే హాత్ జోడో యాత్రలో భాగంగా గురువారం బొంరాస్పేట, కొడంగల్ మండలాల్లో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. శుక్రవారం కొడంగల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధిపై చర్చకు రమ్మంటే రాకుండా లేనిపోని ఆరోపణలు చేయడం సమంజసం కాదని, పీసీసీ హోదాలో అలా మాట్లాడడం సమంజసం కాదని విమర్శించారు. తాను చేసిన అభివృద్ధి కొడంగల్ ప్రజలకు తెలుసని పట్నం పేర్కొన్నారు. రేవంత్రెడ్డి పాదయాత్ర కాదుగదా.. మోకాళ్లపై యాత్ర చేసినా కాంగ్రెస్ గెలువదని ఎమ్మెల్యే అన్నారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్పై మరోసారి విమర్శలు చేస్తే కొడంగల్లో అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించారు.