హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సాగునీటి పారుదలశాఖలో రాబో యే మూడు నెలల్లో దాదాపు 231 మంది ఉద్యోగ విరమణ పొందనున్నారు. వీరిలో ఇంజినీరింగ్ క్యాడర్ ఉద్యోగులు 100 మందికిపైగా ఉంటారని సమాచారం. ఇందులో ఎనిమిది మంది చీఫ్ ఇంజినీర్లు, 35 మంది సూపరింటెండెంట్ ఇంజినీర్లు, 18 మంది డీఈఈలు రిటైర్ కానున్నారు. వీరితోపాటు నాన్టెక్నికల్ విభాగంలో కూడా ఈ ఏడాది 100కుపైగా ఉద్యోగులు విరమణ పొందనున్నారని తెలుస్తున్నది. మార్చిలో కొద్దిమంది విరమణ పొందనుండగా, ఏప్రిల్లో ఎక్కువమంది విరమణ పొందనున్నారని సమాచారం. మే లోనూ మరికొందరు విరమణ పొందనున్నారు.
వీరిలో ఆనకట్టల రక్షణ, ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్, అంతర్రాష్ట్ర జలమండలి, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ తదితర విభాగాలకు చెందినవారు ఉన్నారు. ఇరిగేషన్ శాఖలో చీఫ్ ఇంజినీర్ స్థాయి నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వరకు మొత్తం 2,796 శాంక్షన్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 2,436 మంది పనిచేస్తున్నారు. టెక్నికల్, నాన్ టెక్నికల్, సూపరింటెండెంట్, రికార్డ్ అసిస్టెంట్ తదితర విభాగాలకు 2,538 శాంక్షన్ పోస్టులు ఉండగా ప్రస్తుతం 1,953 మంది ఉన్నారు. రెండింటిలో కలిపి 5,334 శాంక్షన్ పోస్టులకుగాను ప్రస్తుతం 4,389 మంది ఉన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 360, ఇతర విభాగాల్లో 586 మొత్తం 946 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాబోయే మూడు నెలల్లో మరో 231కిపైగా ఖాళీలు ఏర్పడనున్నాయి.
ఇప్పటికే ఉద్యోగ విరమణ పొందినవారిలో దాదాపు 15 మంది ఎక్స్టెన్షన్పై కొనసాగుతున్నారు. వీరిలో ముగ్గురు చీఫ్ ఇంజినీర్లు ఉన్నారు. ఇంటర్స్టేట్, సీడీవో విభాగాలతోపాటు పలువురు కన్సల్టెంట్లుగా కొనసాగుతున్నారు. వారందరినీ తొలగించాలని ఇప్పటికే సర్వీస్లో ఉన్న ఇంజినీర్లు పట్టుబడుతున్నారు. సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే ఈ మేరకు ప్రత్యేకంగా వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.