హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం అమల్లోకి వచ్చింది.. సింగరేణిలో ఉద్యోగులు, కార్మికుల విరమణ వయస్సు పెంపు నిర్ణయం జరిగింది. 61 ఏండ్లకు పెంచుతూ యాజమాన్యం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన జీవోను డైరెక్టర్ బలరాం విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 31 తర్వాత ఉద్యోగ విరమణ పొందిన ప్రతి ఉద్యోగి, అధికారి తిరిగి విధుల్లో చేరడానికి అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఉద్యోగంలో చేరని పక్షంలో తిరిగి విధుల్లో చేరే అవకాశం ఉండదని తెలిపారు. విరమణ పొందిన తేదీ నుంచి తిరిగి విధుల్లో చేరే తేదీ మధ్య కాలాన్ని నో వర్క్ నో పేగా పరిగణిస్తారు. ఆ కాలాన్ని కంపెనీ సర్వీసుగానే గుర్తిస్తారు. విరమణ పొంది తిరిగి విధుల్లో చేరే వారి పింఛన్ను నిలుపుదల చేసేలా సీఎంపీఎఫ్ అధికారులను సింగరేణి కోరనుంది.