హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ)/కొడిమ్యాల/ మల్యాల: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి అనుకొని ఉన్న వెయ్యి ఎకరాల కొడిమ్యాల అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించి, అన్ని రకాలుగా అభివృద్ధి చేపట్టనున్నట్టు అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియల్ చెప్పారు. సోమవారం కొడిమ్యాల అటవీ ప్రాంతాన్ని బాసర సరిల్ ముఖ్య అటవీ సంరక్షణాధికారి శరవణన్, జగిత్యాల జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వరావు, రేంజ్ ఆఫీసర్ లత, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మౌనిక, బీట్ ఆఫీసర్ సాయిరాంతో కలిసి సందర్శించారు. ఎంపీ సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా సీఎం కేసీఆర్, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రాంతాన్ని సందర్శించినట్టు ఆయన తెలిపారు. ఐదేండ్లలో సంవత్సరానికి 200 ఎకరాల చొప్పున సంరక్షణ చర్యలు చేపడుతామని తెలిపారు. వెయ్యి ఎకరాల చుట్టూ అటవీ కంచె ఏర్పాటుచేసి ఐదు కిలో మీటర్ల మేర కాలినడక మార్గం (వాకింగ్ ట్రాక్) మట్టితో ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఔషధ, సుగంధ మొక్కలు నాటుతామని, నర్సరీలు పెంచుతామని, వాచ్టవర్, భక్తులు సేద తీరేందుకు వీలుగా గజిబో నిర్మాణాలు తొలిదశలో చేపడతామని వెల్లడించారు. కోతుల కోసం పండ్ల మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపడతామని తెలిపారు. పథకాల అమలుకు వారధిలా ఉండాలి