హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): కాలవ్యవధి ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని నిరసిస్తూ ఇద్దరు బార్ కౌన్సిల్ సభ్యులు తమ పదవులకు గురువారం రాజీనామా చేశారు. సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్రావు, మరో సభ్యుడు న్యాయవాది బీ శంకర్ తమ రాజీనామాను బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డికి సమర్పించారు. సాధారణ కాలపరిమితి రెండేండ్లు కాగా.. దాన్ని ఐదేండ్లకు పెంచారని, ఆ కాలపరిమితి కూడా ముగిసి రెండేండ్లు పూర్తయిందని వివరించారు. గడువు తీరినా ఎన్నికలు నిర్వహించకుండా అదే పాలకవర్గం కొనసాగడం అప్రజాస్వామికమని, అందుకే తమ సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు.
తెలంగాణ బార్ కౌన్సిల్కు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని గత నెల హైకోర్టు ఆదేశించినప్పటికీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమాధానం చెప్పలేదు. దీంతో రెండు రోజుల క్రితం జరిగిన హైకోర్టు విచారణ సందర్భంగా జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 25కి విచారణను వాయిదా వేశారు. ఎన్నికల షెడ్యూల్తో విచారణకు రావాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించారు. ఈ తెలంగాణ బార్ కౌన్సిల్లో మొత్తం 25 మంది సభ్యులు ఉండగా.. వీరిలో 24 మంది ఎన్నికవుతారు. అడ్వకేట్ జనరల్ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉంటారు.