హైదరాబాద్ : కరోనా తర్వాత ప్రపంచదేశాలను వణికిస్తున్న మరో మహమ్మారి మంకీపాక్స్. ఇప్పటికే 70కిపైగా దేశాల్లో 16వేలకుపైగా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇటీవల భారత్లోనే వైరస్ వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నాలుగు కేసులు దేశంలో నమోదయ్యాయి. తాజాగా ఈ మహమ్మారి రాష్ట్రంలోనూ కలకలం సృష్టిస్తున్నది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు గుర్తించారు.
సదరు వ్యక్తి ఈ నెల 6న కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చాడు. ఈ నెల 20న సదరు వ్యక్తికి జ్వరం రాగా.. 23న దద్దుర్లు కనిపించాయి. సదరు వ్యక్తి కామారెడ్డిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లగా.. డాక్టర్లు మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. సదరు వ్యక్తి రక్త నమూనాలను సేకరించి.. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపామని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
అలాగే సదరు వ్యక్తిని హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతనికి దగ్గరగా ఉన్న ఆరుగురిని ఐసోలేషన్లో ఉంచినట్లు పేర్కొన్నారు. వారికి ఎలాంటి లక్షణాలు లేవని, ముందుజాగ్రత్తగా ఐసోలేషన్లో ఉంచినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సలహాలు సూచనలిస్తున్నారని పేర్కొన్నారు. అయితే, మంకీపాక్స్ ప్రాణాంతకం కాదని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీహెచ్ వివరించారు.