హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం మిల్లింగ్లో బియ్యం, నూకలు (అవుట్ టర్న్ రేషియా) ఎంత శాతం వస్తాయనేదానిపై ప్రభుత్వం శాస్త్రీయంగా అధ్యయనం చేయిస్తున్నది. ఇందుకోసం మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ)కి చెందిన మూడు శాస్త్రవేత్తల బృందాలు గురువారం హైదరాబాద్కు చేరుకొన్నాయి. మూడు రోజులపాటు పలు జిల్లాల్లో ఎంపిక చేసిన మిల్లుల్లో ధాన్యం శాంపిల్స్ను ఈ బృందాలు సేకరిస్తాయి.
రాష్ట్రం నుంచి యాసంగిలో రా రైస్ మాత్రమే తీసుకొంటామని కేంద్ర ప్రభుత్వం మొండికేసిన విషయం తెలిసిందే. దీంతో రైతులు నష్టపోవద్దన్న ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వమే సొంత నిధులతో ధాన్యం సేకరిస్తున్నది. దీనిని మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి రా రైస్ ఇవ్వనున్నది. అయితే, యాసంగి ధాన్యం మిల్లింగ్ చేస్తే ఎఫ్సీఐ నిబంధనల ప్రకారం క్వింటాలకు 67 కేజీల బియ్యం రావు. అధిక శాతం నూకలు వస్తాయి. ఎంతశాతం నూకలు వస్తాయన్నదానిపై ఇప్పటివరకు శాస్త్రీయ అధ్యయనం జరుగలేదు. ఈ నేపథ్యంలో దీనిపై అధ్యయనం చేసే బాధ్యతను రాష్ట్రప్రభుత్వం సీఎఫ్టీఆర్ఐకి అప్పగించింది.
క్వింటాలు ధాన్యానికి ఎంత శాతం బియ్యం, నూకలు వస్తాయో నివేదిక ఇవ్వాలని కోరింది. బీవీ సత్యేంద్రరావు నేతృత్వంలోని బృందం వనపర్తి, యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లో పర్యటించనున్నది. జయదీప్ బృందం కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో, ఎంఎస్ మీరా బృందం నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో పర్యటించి పరిశోధన నిర్వహించనున్నాయి. నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందనున్నది. ఈ నివేదిక ఆధారంగా తగ్గిన బియ్యం శాతానికి ఏం చేయాలనేదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.