హైదరాబాద్ : జిల్లా ప్రజా పరిషత్లు, మండల ప్రజా పరిషత్లకు ఈ బడ్జెట్లో గ్రాంట్ని పెంచాలని కోరుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మంత్రుల నివాసంలోకలిసి విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుత బడ్జెట్ రూ. 500 కోట్ల నుంచి 750 కోట్ల వరకు పెంచాలని ఎమ్మెల్సీ మంత్రిని కోరారు. అలాగే రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఆరోగ్య కార్డుల జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ నిధుల పెంపు ద్వారా జిల్లా, మండల పరిషత్ ల పరిధిలో మరింత అభివృద్ధి చేయడానికి వీలు అవుతుందని ఆయన అన్నారు.
ఆరోగ్య బీమా కల్పించడం ద్వారా NIMS లో ఉచిత వైద్యం పొందేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు వీలు కలుగుతుందని చెప్పారు.
ఈ ప్రతిపాదనను పరిశీలించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిధులు పెరిగే విధంగా చూడాలని వినతి పత్రం అందజేశారు. కాగా మంత్రితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ కమిషనర్ శరత్ కూడా ఉన్నారు.