హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకలను శాసనసభలో ఘనంగా నిర్వహించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి ఆవరణలో, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండా ఎగురవేశారు. శాసనసభ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పోచారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలవుతున్నదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఉన్నత బాధ్యతల్లో ఉన్నవాళ్లు తెలంగాణ అభివృద్ధిని గమనించకపోవడం బాధాకరమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేవారు కేంద్రం ఏం చేసిందో కూడా చెప్పాల్సి ఉంటుందన్నారు. కేంద్రం ఏం చేసిందని అడిగితే.. జాతీయ రహదారుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కొందరికి కనపడకపోతే చేసేదేం లేదన్నారు. వ్యవసాయ క్షేత్రాలను, కొత్త భవనాలను విమర్శించడం తగదన్నారు.
స్వాతంత్య్రం, రాజ్యాంగం ఏ ఒక్కరి సొత్తు కాదని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశాన్ని పాలించే వ్యక్తులు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. రాజ్యాంగం కులం, మతాలది కాదు.. ఒక గ్రంథం లాంటిదని చెప్పారు. రాజకీయ పార్టీలు విమర్శలకే పరిమితం కావొద్దని హితవు పలికారు. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని, మైకులు అందగానే ఆరోపణలు చేయొద్దని సూచించారు.
స్పీకర్ అయినా, ప్రధాని అయినా రాజ్యాంగం పరిధిలోనే పదవులు వచ్చాయని, కొంతమంది కళ్లలో సంతోషం కోసం పరిపాలన చేయొద్దని వెల్లడించారు. అది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉందని, పేదలకు పెద్ద పీట వేయాలన్నారు. 74 ఏండ్ల తర్వాత కూడా పేదలు ఉన్నారని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందుతున్నదని స్పీకర్ పోచారం చెప్పారు.