హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : కాకతీయ వర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్లపై ఉన్నత విద్యామండలి అధికారులు బుధవారం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కాకతీయ వర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్లపై అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఇటీవలే ఆందోళనకు దిగాయి. కొంతమంది విద్యార్థులు వరంగల్లో మంత్రి కేటీఆర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై మంత్రి కేటీఆర్.. విద్యాశాఖ అధికారులను ఆరా తీశారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సమగ్ర నివేదికను అందజేయాలని ఉన్నత విద్యామండలి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ గోపాల్రెడ్డి ఆయా విద్యార్థులను పిలిపించుకొని, వారి వాదనలు విన్నారు. బుధవారం సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను కలిసి ప్రవేశ పరీక్ష ఫలితాలు, అడ్మిషన్ల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను అందజేశారు.