హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను ఏమేరకు అమలు చేశారో వివరించాలని కోరింది. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో కస్టోడియల్ మరణానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా అందజేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్కుమార్తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో బీహార్కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు నితీశ్ అనుమానాస్పద మృతిపై అందిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టింది. నితీశ్ గుండెపోటు వచ్చి మరణించాడని, కస్టోడియల్ డెత్ కాదని అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచందరావు తెలిపారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సిద్ధంగా ఉన్నదని, దానిని స్వీకరించేందుకు రిజిస్ట్రీ నిరాకరించిందని చెప్పారు. ఆ ఫుటేజీని తాము పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.