హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్న అధికారులు.. పోస్టుల భర్తీపైనా దృష్టిసారించారు. కొత్త కోర్సుల్లో పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకు ఆర్థికశాఖ 2,440 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఇటీవలే ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. గతంలో డిగ్రీ అంటే బీఏ, బీకాం, బీఎస్సీ (ఎంపీసీ) కోర్సులు మాత్రమే ఉండేవి. కానీ, కొంతకాలంగా పాత కోర్సులకు స్వస్తి పలికి సులభంగా కొలువులు తెచ్చిపెట్టే కొత్త కోర్సుల నిర్వహణకు ఆయా కాలేజీలు ఆసక్తి చూపుతున్నాయి. దాంతోపాటు దోస్త్లో ప్రవేశపెట్టిన బకెట్ సిస్టంతో కోర్సుల స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఆర్ట్స్ విద్యార్థులు సైన్స్, సైన్స్ విద్యార్థులు ఆర్ట్స్లో ఒక సబ్జెక్టును ఆప్షనల్గా ఎంచుకొనే అవకాశం కల్పించారు. దాంతో కొత్త లెక్చరర్ల అవసరం ఏర్పడుతున్నది.
డిగ్రీ లెక్చరర్ పోస్టులను 2012లో భర్తీచేశారు. ఆ తర్వాతే అనేక కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలనుకొని.. ఎంసెట్లో సీట్లు రాని విద్యార్థులు అత్యధికంగా డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ కోర్సును ఎంచుకొంటున్నారు. ఈ కోర్సు రాష్ట్రంలోని 129 కాలేజీల్లో నిర్వహిస్తున్నారు. కానీ బోధించేందుకు 50 మంది లెక్చరర్స్ మాత్రమే ఉన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన పలు కోర్సులు, సబ్జెక్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. దీన్ని అధిగమించాలంటే ఆయా పోస్టులను భర్తీ చేయాలి. అప్పుడే అధ్యాపకుల కొరత తీరడంతో పాటు ప్రభుత్వ కాలేజీలు బలోపేతమవుతాయని, విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్య అందుతుందని అధికారులు భావిస్తున్నారు.