హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చిన్న చిన్న మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం పాఠశాలలకు ఎమర్జెన్సీ అండ్ మెయింటెనెన్స్ ఫండ్ను అందుబాటులో ఉంచనున్నది. ఒక్కో స్కూల్కు రూ.25 వేలను కేటాయించనున్నది. ఎలాంటి టెండర్లు లేకుండా ఈ నిధులను స్కూళ్లు వాడుకోవచ్చు. ఈ నిధులతో పాఠశాలలకు అవసరమైన స్విచ్లు, వైర్లు, ట్యూబ్లైట్లు, బల్బులు, ఫ్యాన్లు, నీటి సరఫరా ఏర్పాట్లు, నల్లాల బిగింపు, మూత్రశాలలు, తలుపులు, కిటికీల రిపేర్లను చేసుకోవచ్చు. ఈ పనులన్నింటినీ నూతనంగా ఏర్పాటుచేస్తున్న ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’లు చేపడతాయి. కలెక్టర్ వద్ద అందుబాటులో ఉన్న జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్టు (సింగరేణి), స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్తోపాటు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను ఇందుకు కేటాయిస్తారు. జూన్ 10లోపు అంటే స్కూళ్లు పునఃప్రారంభమయ్యేలోపు మరమ్మతులను పూర్తి చేయాలని గడువుగా నిర్ణయించారు. రూ.లక్ష వరకు పనుల చెల్లింపులు ఎంపీడీవోలు చేస్తారు. అంతకు మించితే జిల్లా కలెక్టర్ల ద్వారా బిల్లులు పొందాల్సి ఉంటుంది.
ఇంజినీర్ల పాత్ర నామమాత్రం
ఇదివరకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లు ఉండగా, వీటి స్థానంలో ఇప్పు డు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటుచేశారు. పాఠశాల విద్యలోని అన్ని పనులు ఇక నుంచి గ్రామ, మండల, జిల్లా మహిళా సమాఖ్యలు చేపట్టడమే కాకుండా ఇవే పర్యవేక్షణ చేస్తాయి. దీంతో సివిల్ వర్క్స్, ఇంజినీరింగ్ పనుల్లో ఇంజినీర్ల పాత్ర నామమాత్రం కానున్నది. కేవలం టెక్నికల్ అనుమతులివ్వడం వరకే ఇంజినీర్ల పాత్రను పరిమితం చేశారు.