హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) పట్టణాల జాబితా నుంచి కుమ్రంభీం ఆసిఫాబాద్, వికారాబాద్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తొలగించింది. నిరుడు రాష్ట్రంలోని 23 పట్టణాల్లో నీట్ నిర్వహించగా, ఈ ఏడాది 21 పట్టణాలకే పరిమితం చేసింది. ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ (యూజీ) దరఖాస్తుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు ఎన్టీఏ బులెటిన్ విడుదల చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాల జాబితా నుంచి 58 పట్టణాలను తొలగిస్తున్నట్టు పేర్కొన్నది. నిరుడు 543 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలుండగా, ఈ ఏడాది 485కి తగ్గించింది. ఇప్పటికే జేఈఈ మెయిన్ నిర్వహణలో నాలుగు పట్టణాలను తొలగించిన విషయం తెలిసిందే. ఎన్టీఏ నిర్ణయంతో వికారాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల విద్యార్థులు వేరే ప్రాంతాలకు వెళ్లి పరీక్ష రాయాల్సి దుస్థితి ఏర్పడింది.
హైదరాబాద్/సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్నగర్, హయత్నగర్, ఆదిలాబాద్, భూపాలపల్లి, గద్వాల, జగిత్యాల, జనగామ, కొత్తగూడెం, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట ఉన్నాయి. కాగా, అన్ని క్యాటగిరీల వారికి దరఖాస్తు ఫీజును రూ.100 పెంచారు.
నీట్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందికి ఒకే మార్కులొస్తే వయస్సు, పుట్టిన తేదీ ఆధారంగా ఎవరు పెద్దవారైతే వారికి ముందు ర్యాంకు ఇచ్చి, ఆ తర్వాత వారికి వరుసగా ర్యాంకులు కేటాయించేవారు. కానిప్పుడు ఈ విధానాన్ని పూర్తిగా మార్చినట్టు ఎన్టీఏ ప్రకటించింది. బయాలజీలో పర్సంటైల్ సాధించిన వారికి తొలి ప్రాధాన్యం, ఆ తర్వాత కెమిస్ట్రీ, ఆ తర్వాత ఫిజిక్స్లో వచ్చిన పర్సంటైల్ పరిగణనలోకి తీసుకొని ర్యాంకింగ్ ఇస్తారు.