బాన్సువాడ, సెప్టెంబర్ 8 : ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. చేపల పంపిణీ, విక్రయాల్లో దళారుల వ్యవస్థను అంతమొందించాలని సూచించారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు (మినీ ట్యాంక్ బండ్)లో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి చేప పిల్లలను విడుదల చేశా రు. అంతకుముందు ఆయన చేప పిల్లల సైజు ను పరిశీలించారు.
కొలతలు తీయగా.. సైజ్ కేవలం 60 నుంచి 70 మిల్లీమీటర్లు ఉండటంతో మత్స్య శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇప్పటికే రెండుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసి మత్స్యకారులు, మత్స్యశాఖ కమిషనర్కు సూచనలు చేశానని, అయినప్పటికీ సైజులేని చిన్న చేప పిల్లలనే తీసుకురావడంలో ఆంతర్యమేమిటని మండిపడ్డారు. అనంతరం పెద్ద సైజులో ఉన్న బొచ్చ చేప పిల్లలను కలెక్టర్తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోచారం మాట్లాడుతూ.. మంచి సైజు ఉన్న చేప పిల్లలను చెరువులో విడుదల చేస్తే అధిక లాభాలు వస్తాయన్నారు. ప్రభు త్వం రూ.100కోట్లతో చేప పిల్లలను ఉచితం గా అందిస్తే మత్స్యకారులకు ఏడాదికి రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు.
మైక్ దొరికితే ఏదైనా మాట్లాడతారా?
నిజామాబాద్ జిల్లా కోటగిరి, వర్ని మండల కేంద్రాల్లో పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలోనూ స్పీకర్ పోచారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందువరుసలో ఉన్నదన్నారు. ఎనిమిదేండ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని, మైక్ దొరికితే చాలు ఏది పడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారి మాటలను ఎవరూ పట్టించుకోవద్దని పోచారం సూచించారు.