నల్లగొండ : నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో 8 నామినేషన్లు ఆమోదం పొందగా మూడు తిరస్కరణకు గురైనట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికలలో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ప్రతిపాదకుల సమక్షంలో రిటర్నింగ్ అధికారి నామినేషన్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా నల్లగొండ స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గం ఒక స్థానం ఎన్నికకు గాను మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 8 నామినేషన్లు ఆమోదించగా.. తక్కిన ముగ్గురి నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు తెలిపారు.
ఆమోదించిన నామినేషన్లలో టీఆర్ఎస్ అభ్యర్ధి ఎం.కోటి రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు కాసం వెంకటేశ్వర్లు, రాం సింగ్ కొర్రా, బెజ్జం సైదులు, తందు సైదులు, అరుపుల శ్రీశైలం, డా.కె నగేష్, వంగూరి లక్ష్మయ్య నామినేషన్లు ఆమోదించారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసిన బడుగుల రవీందర్, దాచేపల్లి నాగేశ్వర్ రావు, పాదూరి గోవర్దని నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి జివెల్లడించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్, సహాయ రిటర్నింగ్ అధికారి వి.చంద్రశేఖర్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువన గిరి జడ్పీసీఈవోలు వీర బ్రహ్మ చారి, సురేష్, కృష్ణారెడ్డి ఉన్నారు.