హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను వెంటనే పరిష్కరించాలని, గత నాలుగేండ్లుగా 14 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.8 వేల కోట్ల ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమారను కోరారు. మంగళవారం హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టిని జాజుల శ్రీనివాస్గౌడ్ కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం మీడియాతో జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. నాలుగేండ్లుగా ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో వేలాదిమంది విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని, ఫీజులు చెల్లించాలని ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు వేధిస్తుండటంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జీవో-8,9ని రద్దుచేసి పాత పద్ధతిలోని రీయింబర్స్మెంట్ను అమలు చేయాలని కోరారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పదివేలలోపు ర్యాంకు నిబంధనను ఎత్తివేసి పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫీజు బకాయిల చెల్లింపుపై రెండు మూడు రోజుల్లోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రులు, అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి సానుకూల నిర్ణయం తీసుకొంటామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని జాజుల తెలిపారు.