హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో ఒక యంత్రం చెడిపోతే.. మరమ్మతులు చేసి పునరుద్ధరించడానికి రోజులు, వారాలు పడుతుందనే భావన అందరిలోనూ ఉన్నది. కానీ, ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చిన ‘ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ పాలసీ’ (ఏఎంసీ)తో ఫిర్యాదు చేసిన గంటల్లోనే మరమ్మతులు పూర్తయ్యే అవకాశం దక్కింది. వైద్యారోగ్య రంగాన్ని మరింత పటిష్ఠం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను అన్ని విధాలా బలోపేతం చేస్తున్నారు. రక్త, మూత్ర పరీక్షలు మొదలు.. రేడియాలజీ, పాథాలజీ వరకు అన్ని పరీక్షలు పేదలకు ఉచితంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే పరీక్షచేసే యంత్రాల నిర్వహణ సరిగా లేకుంటే లక్ష్యం నెరవేరదని గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేకంగా పాలసీని రూపొందించి అమలు చేస్తున్నది.
పరికరాల విభజన.. ప్రత్యేకంగా వ్యవస్థ
రాష్ట్రంలో డీఎంఈ, టీవీవీపీ, డీపీహెచ్ల పరిధిలో వెయ్యికి పైగా దవాఖానలు ఉన్నా యి. వీటి కోసం ప్రభుత్వం సుమారు రూ. 350 కోట్ల వరకు ఖర్చు చేసి అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేసింది. వీటి నిర్వహణకు ఏఎంసీ పాలసీని అమలు చేస్తున్నది. ఇందుకు టీఎస్ఎంఎస్ఐడీసీలో ప్రత్యేకంగా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్ (పీఎంయూ)ను నెలకొల్పారు. దీనిని ఇటీవలే మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఇందులో ఒక ప్రాజెక్టు మేనేజర్, ఒక బయోమెడికల్ ఇంజినీర్, ఇద్దరు డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఉంటారు. పరికరాలు చెడిపోతే ఫిర్యాదు చేసేందుకు ‘ఈ-ఉపకరణ్’ పేరుతో ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించారు.
అన్ని దవాఖానల సూపరింటెండెంట్లకు ప్రత్యేక లాగిన్ ఐడీ కేటాయించారు. వారి పరిధిలోని ఏదైనా పరికరం మొరాయిస్తే పోర్టల్లో క్షణాల్లో ఫిర్యాదు చేయవచ్చు. లాగిన్ అయిన తర్వాత ఫిర్యాదు చేయాల్సిన ఆప్షన్ ఎంచుకోగానే ఆ దవాఖానలో ఉన్న పరికరాల జాబితా, వాటి యూనిక్ నంబర్లతో సహా కనిపిస్తుంది. ఏ పరికరం మొరాయిస్తున్నదో ఎంపిక చేసుకొని, దాని గురించి సంక్తిప్తంగా వివరిస్తారు. ఈ ఫిర్యాదు నేరుగా పీఎంయూకు వెళ్తుంది. అక్కడున్న సిబ్బంది ఆ పరికరం వారంటీ పరిధిలో ఉన్నదా లేక కంపెనీ మెయింటెనెన్స్ పరిధిలోకి వచ్చిందా చూస్తారు.
సంబంధిత కంపెనీకి ఫిర్యాదును పంపిస్తారు. కంపెనీ ఇంజినీర్లు దవాఖానకు వెళ్లి మరమ్మతులు పూర్తి చేసేవరకు నిరంతరం పర్యవేక్షిస్తారు. తద్వారా చిన్న మరమ్మతులైతే గంటల్లోనే పూర్తవుతాయని, పెద్ద సమస్య అయితే రోజుల్లోనే పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం క్యాటగిరీ-ఏలోని 1,020 పరికరాల నిర్వహణను పీఎంయూకు అప్పగించారు. ఈ పాలసీతో ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు వైద్య పరీక్షలు నిరంతరాయంగా అందుబాటులోఉంటాయి. తద్వారా తక్షణం వైద్యసేవలు అందుతాయని వైద్య వర్గాలు తెలిపాయి.