హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెంట్రల్ వ్యాల్యుయేషన్ అడ్వైజరీ కమిటీ సూచనల మేరకు మార్కెట్ ధరల పెంపుపై కసరత్తు చేసేందుకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వ్యవసాయ భూముల మూల మార్కెట్ విలువ 50 శాతం, ఖాళీ స్థలాలు 35 శాతం, అపార్ట్మెంట్ల మార్కెట్ విలువ 25 శాతం పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. దీంతోపాటు బహిరంగ మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అవసరమైన మేర మార్కెట్ వ్యాల్యూని సవరించనున్నట్టు సమాచారం. పెరిగే ధరలు ఫిబ్రవరి 1వ తేదీ లేదా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు అధికారవర్గాలు తెలిపాయి.