TS TET | హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : పెంచిన టెట్ ఫీజులను వెంటనే తగ్గించాలని నిరుద్యోగులు, అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెట్ ఫీజులను పెంచడమంటే నిరుద్యోగులకు అన్యాయం చేసినట్టేనని మండిపడ్డారు. టెట్ ఫీజులను తగ్గించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) ఆధ్వర్యంలో నిరుద్యోగులు, అభ్యర్థులు బుధవారం టెట్ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య మాట్లాడుతూ… గతంలో టెట్ ఒక పేపర్కు రూ.200 ఫీజు ఉండగా దాన్ని వెయ్యికి.. రెండు పేపర్లు రాసే అభ్యర్థులకు రూ.300గా ఉన్న ఫీజును ఏకంగా రెండువేలకు పెంచడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికే కోచింగ్, శిక్షణ, హాస్టల్ ఫీజులకే వేలకు వేల రూపాయలు ఖర్చులతో ఇబ్బంది పడుతున్న అభ్యర్థులకు ఇది మరింత భారం కానున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎకడ లేని విధంగా టెట్ ఒకో పేపర్ కి వెయ్యి రూపాయల ఫీజు చెల్లించాలనడం మూర్ఖత్వమేనని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయబోమని చెప్పి ఇప్పుడు మాట మార్చడం సరికాదని అన్నారు. టెట్ ఫీజు తగ్గించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నేతలు నాగేందర్, అవినాశ్, శ్రీకాం త్, రాకేశ్, క్రాంతి, జాన్, వంశీ ఉన్నారు.
తొలిరోజు 4,050 దరఖాస్తులు
టెట్కు తొలిరోజు కేవలం 4,050 దరఖాస్తులొచ్చాయి. మొదటి రోజు కావడంతో అభ్యర్థుల నుంచి స్పందన రాలేదు. ఫీజులు భారీగా పెంచడంతో అభ్యర్థులు దరఖాస్తు చేయాలా? లేదా? అన్న సందిగ్ధంలో ఉన్నా రు. తొలిరోజు అభ్యర్థులు సాంకేతికలోపం, వెబ్సైట్ మొరాయించడంతో దరఖాస్తు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. చివరికి సాంకేతిక నిపుణులు.. వెబ్సైట్కు ముందు httpsకు బదులుగా http అని చేయడంతో ఇలా జరుగుతున్నదని గుర్తించారు. వెబ్సైట్ పూర్తి అడ్రస్ను టైపు చేయాలని సూచించారు.
వెబ్సైట్ తప్పులమయం
టెట్ వెబ్సైట్లో పలు తప్పులతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొన్నది. దరఖాస్తుల్లో గతంలో టెట్ క్వాలిఫై అయిన వివరాలను నమోదుచేసుకునే అవకాశానిచ్చారు. ఈ వివరాల నమోదుకు ఇచ్చిన ఆప్షన్లల్లో కొన్ని తప్పులున్నాయి. టెట్ పరీక్షను 2017 డిసెంబర్లో జరిగినట్టుగా వెబ్సైట్లో పొందుపరిచారు. ఇది శుద్ధతప్పు. టెట్ పరీక్షను 2017 జూలైలో నిర్వహించారు. కానీ వెబ్సైట్లో మాత్రం 2017 డిసెంబర్ అని పేర్కొన్నారు. దీంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొన్నది. ఇక 2016 మేలో టెట్ను నిర్వహించారు. కానీ 2016 వివరాలను వెబ్సైట్లో పేర్కొనలేదు. దీంతో ఈ టెట్ పరీక్షలో క్వాలిఫై అయిన వారు తమ మార్కులను వెబ్సైట్లో నమోదుచేసుకొనే అవకాశాన్ని కోల్పోయారు.
టీచర్లకు అనుమతి అక్కర్లేదు : శ్రీదేవసేన
రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు టెట్ రాయాలంటే అనుమతి పొందాల్సిన అవసరంలేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. టీచర్లు టెట్ రాయాలంటే విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాలని టెట్ కన్వీనర్ రాధారెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు ఉపాధ్యాయ సంఘాలు దీనిపై అభ్యంతరం వ్యక్తంచేశాయి. దీంతో టెట్ రాసేందుకు టీచర్లుఅనుమతి తీసుకోవాల్సిన అక్కర్లేదని శ్రీదేవసేన స్పష్టంచేశారు.