హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): అన్ని అవయవాలు బాగున్న మనుషులే జీవించడానికి అనేక కష్టాలు పడుతుంటారు. అలాంటిది అంగవైకల్యం ఉన్న వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పని పడితే ఆ పని చేయలేని నిస్సహాయ స్థితి, స్వయం ఉపాధికి ఆర్థిక పరిస్థితులు సహకరించక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారి కష్టాలను అర్ధం చేసుకున్న డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ దివ్యాంగులకు చేయూతను అందించడానికి గ్రో పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా రాష్ట్రంలో వేయి మంది దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చింది. ఉమ్మడి మహబూబ్నగర్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొడ జిల్లాల నుంచి వేయి మంది దివ్యాంగులను ఎంపిక చేసి, వారికి వ్యాపార మెళకువలు నేర్పి, ఆర్థిక సహాయం అందిస్తారు. ఆరు నెలలపాటు వారు ఏ విధంగా వ్యాపారం చేస్తున్నారో గమనిస్తూ ఇబ్బందులెదురైతే అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. అర్హుల ఎంపిక కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)తో ఒప్పందం చేసుకున్నారు. గ్రో కార్యక్రమం ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభించారు. ఎలాంటి విద్యార్హత లేని దివ్యాంగులు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్న ఆడ, మగవారిని ఎంపిక చేస్తారు. వారికి ఆసక్తి, అనుభవం ఉన్న వ్యాపారాన్ని తెలుసుకొని శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇచ్చిన అనంతరం 25 వేలను సీడ్ క్యాపిటల్గా అందిస్తారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.
దివ్యాంగులు నిలదొక్కుకోవడానికి
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ చేపట్టిన గ్రో కార్యక్రమానికి మహబూబ్ నగర్ జిల్లాలో మంచి స్పందన ఉన్నది. మిగిలిన జిల్లాల్లో కూడా అర్హులైన వారిని ఎంపిక చేస్తాం. రాష్ట్రంలోని మహబూబ్నగర్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల దివ్యాంగుల కోసం సహాయం అందించడానికి 91003 53968, 040-23319697 నంబర్లను సంప్రదించండి.
– శ్రీలక్ష్మి, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ప్రతినిధి
ఆసరా అయ్యింది
గతంలో చిన్న కిరణా షాపు ఉండేది. డబ్బులు కొద్దిగానే ఉండటంతో తక్కువ సరుకులు తెచ్చుకునేటోల్లం. గతంలో రోజుకు 1000-1200 వరకు మాత్రమే గిరాకీ అయ్యేది. కానీ డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వారు ట్రైనింగ్ ఇచ్చారు. రూ.25 వేల సాయం చేశారు. ఈ డబ్బులతో ఎక్కువ సరుకులు తెచ్చుకున్నాను. ఈ పైసలు నాకు ఎంతో ఆసరా అయినాయి. ఇప్పుడు రోజుకు 2000-2500 వరకు గిరాకీ అయితాంది.
– శారద, రవీంద్రనగర్, మహబూబ్నగర్
ధైర్యం వచ్చింది
మాకు చిన్న షాపు ఉంది. రెండు వేలు పెట్టి సామాను తెచ్చుకున్నాం. రోజుకు 100-150 కంటే ఎక్కువ గిరాకి కాకపోయ్యేది. ఖాళీగా ఉన్నప్పుడు కుట్టు మిషన్ కుట్టుకునేదాన్ని. బ్యాంకు లోను ట్రై చేశాను. కానీ ఇయ్యలేదు. ఇప్పుడు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వాళ్లు రూ.25 వేలు ఇయ్యడంతో సామాను ఎక్కువ తీసుకొచ్చినం. ఇప్పుడు రోజుకు 500-600 వరకు గిరాకీ అయితాంది. ఇప్పుడు దైర్యం వచ్చింది.
– సుజాత, అన్నాసాగర్, భూత్పుర్ మండలం, మహబూబ్నగర్ జిల్లా