హైదరాబాద్ : వెహికల్ రెట్రోఫిట్మెంట్లో తెలంగాణ పాలసీ దేశానికే తలమాణికంగా ఉండేలా తయారు చేబోతున్నామని రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై సతీష్ రెడ్డి పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ కోసం ఆటోల్లో పాత డీజిల్, పెట్రోల్ ఇంజిన్ తొలగించి ఎలక్ట్రిక్ కిట్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్లో మొదట 100 ఆటోల్లో ఎలక్ట్రిక్ కిట్లు బిగించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనికి సంబంధించి ఆటో యూనియన్లు, రెట్రోఫిట్మెంట్ కంపెనీల ప్రతినిధులతో ఖైరతాబాద్లోని అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, సెంటర్ ఫర్ ఎనర్జీ స్టడీస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆటో యూనియన్లు, రెట్రోఫిట్మెంట్ కిట్ తయారీ సంస్థలు, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. రెట్రోఫిట్మెంట్ ఎలా చేయాలి? ఎలాంటి ఆటోలు ఎంపిక చేయాలి..? అమలు తీరుకు సంబంధించి
అంశాలతో పాటు.. యూనియన్లు, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాల ప్రతినిధులతో.. రెట్రోఫిట్మెంట్ అమలు తీరుపై చర్చించారు. అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజీ, హైదరాబాద్, తెలంగాణ రెడ్కో సంయుక్తంగా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించాయి.
ఈ కార్యక్రమంలో రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. కాలుష్యం నుంచి హైదరాబాద్కు, రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి చేరిందన్నారు. పీల్చే గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాస సంబంధమైన సమస్యలతో హాస్పిటల్స్లో చేరుతున్నారు. మన హైదరాబాద్లో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టాం. కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆటో డ్రైవర్లు, యూనియన్లు సహకరించాలని కోరారు.
పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్లో 100 ఆటోల్లో రెట్రోఫిట్మెంట్ ద్వారా ఎలక్ట్రిక్ కిట్లు బిగించబోతున్నామని సతీశ్ రెడ్డి ప్రకటించారు. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడతాం. ఆటోల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది. ఒక ఆటోలో ఎలక్ట్రిక్ కిట్ ఏర్పాటు చేయడానికి రూ. 85 వేలు ఖర్చు అవుతుంది. ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.15,000 సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించింది. మిగతా డబ్బులకు కూడా భారం కాకుండా ఫైనాన్స్ సంస్థలతో లోన్ ఇప్పించేలా కృషి చేస్తాం. అలాగే ఎలక్ట్రిక్ ఆటోలతో యజమానులకు ఖర్చు తగ్గి.. రోజువారి ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. బ్యాటరీ భారం కూడా ఆటో యజమానులపై పడకుండా.. స్వాపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి కేవలం యూజర్ చార్జీలు మాత్రమే తీసుకునేందుకు కంపెనీలు కూడా ముందుకొచ్చాయన్నారు.
పెట్రోల్, డీజిల్ ఖర్చు, వాటి సర్వీసింగ్కు అయ్యే ఖర్చుతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని సతీశ్ రెడ్డి తెలిపారు. ఈ డబ్బులు బ్యాంకుల నుంచి ఈఎమ్ఐ ద్వారా చెల్లించే వెసులుబాటు కూడా కల్పించబోతున్నాం. అలాగే.. బ్యాటరీల చార్జింగ్ కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా.. స్వాపింగ్ కేంద్రాలు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మొదట ఎనిమిది బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆటోల సంఖ్య, డిమాండ్ను బట్టి కేంద్రాలను మరింత పెంచుతాం. దీనికి సంబంధించి ఆటోయూనియన్ల సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. అందరి సలహాలు, సూచనలతో దేశానికే తలమాణికమైన పాలసీ తయారుచేద్దాం… అని సతీశ్ రెడ్డి అన్నారు.
ఇక.. రెట్రోఫిట్మెంట్ అందిస్తున్న సంస్థలు, బ్యాటరీ సంస్థలకు సతీష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ సెమినార్ నిర్వహించిన అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాను ఆయన అభినందించారు. భవిష్యత్ లో ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో రెడ్కో సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల విభాగం ప్రాజెక్ట్ డైరెక్టర్ రామకృష్ణ, అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా.. సెంటర్ ఫర్ ఎనర్జీ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజ్ కిరణ్, 10 ఆటోల యూనియన్ల నాయకులు, నాలుగు రెట్రోఫిట్మెంట్ కంపెనీల ప్రతినిధులు, మూడు బ్యాటరీ స్వాపింగ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.