హైదరాబాద్ : నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ అని, అవగాహన రాహిత్యానికి నిలువెత్తు రూపమని రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తోపాటు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తుంటే, రైతులపై అదనపు భారం మోపే PM KUSUM స్కీం అవసరం ఏముందని ప్రశ్నించారు. తెలంగాణలో PM KUSUM స్కీం అమలు చేస్తే రైతులపై మోయలేని భారం పడటం తప్ప ఉపయోగమేంటని నిలదీశారు.
ఈ స్కీంలో 5 హెచ్పీ సబ్ మెర్సిబుల్ పంప్ కోసం సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు రూ. 2,73,548 ఖర్చు అవుతుందని, ఇందులో కేంద్రం 30 శాతం(రూ. 80 వేలు) మాత్రమే సబ్సిడీ ఇస్తోందని, మిగతా రూ.1,93,450 రైతులే చెల్లించుకోవాలన్నారు. ప్రస్తుతం నేరుగా వ్యవసాయ కరెంట్ కనెక్షన్ తీసుకుంటే రూ.5,500 ఖర్చు అవుతుందన్నారు. ఇప్పటికే కేంద్రానికి 300 సోలార్ పంపు సెట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని తెలిపారు. అది కూడా అటవీ ప్రాంతాల్లోని మూరుమూల గ్రామాల్లో విద్యుత్ లైన్లు వేసేందుకు రైతుల కోసం అడిగామని వివరించారు. దీనికి సంబంధించి రెడ్కో సంస్థ వెబ్ సైట్లో వివరాలు కూడా పెట్టామన్నారు.
రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో, తహశీల్దార్ ఆఫీసుల దగ్గర ఫ్లెక్సీలు పెట్టి ప్రచారం చేసిందని దాని ద్వారా కేంద్రానికి నేరుగా ఏమైనా అప్లికేషన్లు వచ్చి ఉంటే తమకు తెలపాలన్నారు. ఈ స్కీంలో ఆఫ్ గ్రిడ్ సోలార్ వ్యవస్థ వ్యవసాయ బావుల దగ్గర ఏర్పాటు చేస్తే కేవలం 7 నుంచి 8 గంటలు మాత్రమే విద్యుత్ పొందే అవకాశం ఉందని తెలిపారు. సాయంత్రం నాలుగున్నర తర్వాత సోలార్ ప్యానల్స్ విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గిపోయి మోటార్లు నడిచే పరిస్థితి ఉండదన్నారు. మధ్యప్రదేశ్లో రాష్ట్ర సబ్సిడీ 60 శాతానికి పెంచిందన్న అర్వింద్.. 24 గంటల కరెంట్ సదుపాయం ఉందా అని ప్రశ్నించారు. మొతేరాలో 100 శాతం సోలార్ ప్యానల్స్లో విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పిన అర్వింద్కు.. తెలంగాణలోని చాలా ఏళ్ల క్రితమే వందశాతం సోలార్తో రెండు గ్రామాలున్నాయని తెలియకపోవడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటక, ఉత్తరాఖండ్లో PM KUSUM స్కీం ప్రతిపాదనలు ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీలో ఇప్పటి వరకు ఒక యూనిట్ కూడా ఎందుకు ఇన్స్టాల్ కాలేదో అర్వింద్ చెప్పాలి. వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతులో పెట్టి, రైతులను కూలీలుగా మార్చే కుట్రలు చేస్తున్న బీజేపీకి చెందిన అర్వింద్.. రైతుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు. రైతులను కార్లతో తొక్కించి చంపిన చరిత్ర ఉన్నోళ్లు.. రైతుల పక్షాన మాట్లాడినట్టుగా నటించడం సిగ్గుచేటన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని పసుపు రైతులను నిండా ముంచిన అర్వింద్.. ఏ ముఖం పెట్టుకుని రైతుల గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.