Satish Reddy | తెలంగాణ ప్రజలు దశాబ్ధి ఉత్సవాలు చేసుకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి కండ్లమంటగా ఉందని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి విమర్శించారు. స్వరాష్ట్రం సాధించి.. ఫలితాలు పొందుతున్న ప్రజలకు తప్ప.. ఎలాంటి ఉద్యమం చేయని సంజయ్ ఏం తెలుసని ప్రశ్నించారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు విఫలమైందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి మోడల్ దేశం కోరుకుంటుందని, తెలంగాణ సాధిస్తున్న విజయాలకు కేంద్రం ఇస్తున్న అవార్డులే తార్కాణమన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న పది రాస్ట్రాలకు ఎన్ని అవార్డులు వచ్చాయని ఆయన ప్రశ్నించారు.
రెండు దశాబ్దాలకుపైగా బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లోని గ్రామాలకు వచ్చిన అవార్డులెన్ని? అంటూ నిలదీశారు. తెలంగాణ కేవలం ఏడేళ్లలోనే ప్రపంచస్థాయిలో నంబర్ వన్గా అవతరించిందని, దేశంలో అటవీ విస్తీర్ణం, భూగర్భ జలాలు పెరిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు సగర్వంగా జరుపుకుంటుందని, బీజేపీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం, ఇల్లు, రైతులకు పంటల బీమా ఇస్తామంటున్న సంజయ్ను ప్రస్తుతం ఇవ్వకుండా ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దేశాన్ని తొమ్మిదేళ్లుగా ఏలుతున్న బీజేపీ దేశానికి ఏం చేసిందన్నారు. పదేళ్ల అభివృద్ధి పండగ చేసుకుంటున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా, ఉద్యమస్ఫూర్తిని దెబ్బతీసేలా మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని సతీశ్రెడ్డి హెచ్చరించారు.