ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 22: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం మిర్చి పంటకు రికార్డు స్థాయి ధర పలికింది. బుధవారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటాకు గరిష్ఠంగా రూ.19,100లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో ఈ సీజన్లో కొత్త రకం పంటకు అత్యధిక ధర పలకడం ఇదే మొదటిసారి. ఒక్కరోజు వ్యవధిలోనే క్వింటాల్కు రూ.600 పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. విదేశీ మార్కెట్లో తేజా రకం పంటకు మంచి ఆదరణ ఉండటంతో ఖరీదుదారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. యార్డుకు వచ్చిన పంట పూర్తిగా నాణ్యమైనది కావడంతో 70 శాతం పంటను ఖరీదుదారులు నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఉదయం జెండాపాట సమయానికి 51 వేల బస్తాలు మార్కెట్కు వచ్చినట్టు అధికారులు తెలిపారు.