హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా ఏటూరునాగారం అభయారణ్యంలో నిలిచిపోయిన ఎకో టూరిజం పున:ప్రారంభమైంది. తొలుత తాడ్వాయి హట్స్, లక్నవరం, బ్లాక్బెర్రీ ఐలాండ్స్ దగ్గర సైక్లింగ్, ట్రెకింగ్ కార్యక్రమాలను పునఃప్రారంభించినట్టు ములుగు జిల్లా అటవీశాఖ అధికారి కిష్టాగౌడ్ తెలిపారు. ములుగు జిల్లా పరిధిలో లక్నవరం, బొగత జలపాతంతోపాటు చుట్టుపకల అడవిలో అనేక దర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్ నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రాత్రి బస చేసేందుకు లక్నవరం దగ్గర టూరిజం హోటళ్లతోపాటు, తాడ్వాయిలో అటవీశాఖ హట్స్ అందుబాటులో ఉన్నాయి. లక్నవరం, తాడ్వాయి, బొగత చుట్టు పకల ప్రాంతాలను కలిపి ఒక సర్యూట్గా అటవీశాఖ అభివృద్ధి చేస్తున్నది. ఇక్కడి అటవీ ప్రాంతాలు, పారే నదులు, నీటి కొలనులు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి.
అటవీ అందాలను తిలకిస్తూ సైక్లింగ్
ప్రస్తుతం లక్నవరంతోపాటు తాడ్వాయి హట్స్ దగ్గర రెండుమూడు కిలోమీటర్ల పరిధిలో అటవీ అందాలను తిలకించేందుకు వీలుగా ట్రెకింగ్, సైక్లింగ్ ప్రారంభమైంది. సైక్లింగ్ కోసం గంటకు రూ.వంద చెల్లించాల్సి ఉంటుంది. దారిలో లక్నవరం అలుగు, తూములు, వాచ్టవర్ నుంచి బర్డ్ వాచింగ్, అటవీ, సరస్సు అందాలను వీక్షించవచ్చు. అటవీశాఖ ద్వారా గైడ్ కూడా అందుబాటులో ఉంటారు. తాడ్వాయి సమీపంలో ఉన్న బ్లాక్బెర్రీ ఐలాండ్, పురాతన రాకాసి గుహలను కూడా సందర్శించవచ్చు. లక్నవరం సమీపంలో ఒక రాత్రి టెంట్లో బసచేసేలా మొత్తం 24 గంటలు ప్యాకేజీ త్వరలో అందుబాటులోకి రానున్నది. తాడ్వాయి హట్స్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐలాపూర్ వరకు సఫారీ వాహనంలో దట్టమైన అటవీ ప్రాంతంలో సంచరించే అవకాశం ఉన్నది. అటవీశాఖ తరఫున సఫారీ వాహనం అందుబాటులో ఉంటుంది. అటవీ ప్రాంతాలన్నీ ప్లాస్టిక్ ఫ్రీ జోన్లని, సందర్శకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు కోరారు. వివరాల కోసం 8074827875 (లక్నవరం), 738261 9363 (తాడ్వాయి) నంబర్లలో సంప్రదించవచ్చు. తెలంగాణ అటవీ ప్రాంతాల్లో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటి సందర్శనకు వీలుగా తగిన కొత్త ఎకో టూరిజం పాలసీ రూపకల్పన జరుగుతున్నదని, ప్రభుత్వ అనుమతితో త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు.