హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి: శోభకృత్ నామ సంవత్సరంలోనూ సమృద్ధిగా వర్షాలు కురిసి తెలంగాణ సస్యశ్యామలంగా విరాజిల్లుతుందని, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పంచాంగ శ్రవణం సందర్భంగా ప్రముఖ జ్యోతిష్య పండితుడు బాచంపల్లి సంతోష్కుమార్శాస్త్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పాలన సుస్థిరంగా ఉంటుందని, తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. బుధవారం రవీంద్రభారతిలో భాషా సాంస్కృతికశాఖ, దేవాదాయశాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ పఠనం చేశారు.
కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, చామకూర మల్లారెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ భానుప్రసాద్, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, కాలే యాదయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, కార్పొరేషన్ల చైర్మన్లు, వేణుగోపాలచారి, దీపికారెడ్డి, డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, డీజీపీ అంజనీకుమార్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు, అర్చకులు, నాదస్వర విద్యాంసులు, వేద, వీరశైవ ఆగమ పండితులు, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికరంగాలకు చెందిన మొత్తం 34 మందిని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పురస్కారాలతో సత్కరించారు. అనంతరం సంతోష్కుమార్శాస్త్రి పం చాంగ పఠనం చేశారు. ఈ ఏడాది బుధుడు రాజుగా, శుక్రుడు మంత్రిగా ఉండటం వల్ల అన్ని వర్గాలకు శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురిసి కాళేశ్వరం, శ్రీశైలం, నాగార్జునసాగర్తోపాటు తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతాయని వివరించారు. పంటలు సైతం పుష్కలంగా పండుతాయని భరోసా ఇచ్చారు. ప్రజలు సుఖ సంతోషాలతో వర్థిల్లుతారని తెలిపారు.
మీడియా రంగానికి సైతం ఈ ఏడాది అద్భుతంగా ఉంటుందని చెప్పారు. వైరస్ల ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు పడటంతోపాటు ప్రపంచ దేశాలతో మైత్రి బంధాలు పెరుగుతాయని అన్నారు. పెండింగు బిల్లులకు క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉన్నదని, న్యాయ వ్యవస్థ ద్వారా మంచి తీర్పులు వినబోతున్నామని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల నుంచి ప్రభుత్వానికి అనుకూల తీర్పులు వెలువడే వీలున్నదని తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు, మత ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉన్నదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో రాజకీయ రంగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయని, న్యాయస్థానాల తీర్పులు సముచితంగా ఉంటాయని తెలిపారు. దేశంలో మహిళలు అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. శోభకృత్ నామ సంవత్సరం అందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ గత తొమ్మిదేండ్లలో అద్భుతమైన, సుస్థిరమైన పాలన అందించడంతో అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాల్లో ఉన్నారని పేర్కొన్నారు. దేశం గర్వించ దగ్గ రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని కొనియాడారు.
కవులు, కళాకారులకు సత్కారం
రవీంద్రభారతిలో బుధవారం సాయంత్రం నిర్వహించిన కవి సమ్మేళనంలో సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొని పలువురు కవులు, కళాకారులను సత్కరించి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర ప్రశంసనీయమని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధం గా సీఎం కేసీఆర్ కవులు, కళాకారులు, సాహితీవేత్తలను గౌరవిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, కవులు అమ్మంగి వేణుగోపాల్, సిద్ధ్దార్థ రామచంద్రమౌళి, వనపట్ల సుబ్బయ్య, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, శ్రీకాంత్, నెల్లెట్ల రమాదేవి, జూపాక సుభద్ర, అయినంపూడి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బొల్లారంలో తొలిసారి
తొలిసారిగా బొల్లారంలోని రాష్ట్రపతిభవన్లో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము వర్చువల్ పద్ధతిలో పాల్గొన్నారు. కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి మహమూద్ అలీ, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. పంచాంగ పఠనాన్ని బ్రహ్మశ్రీ పాలెపు రాజేశ్వరశర్మ చేశారు.
రాష్ట్రంలో ఘనంగా వేడుకలు
శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. భక్తులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల వేద పండితులు పంచాంగ పఠనం నిర్వహించారు. యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు భద్రాచలం, వేములవాడ, ధర్మపురి, కీసర, కాళేశ్వరం, రామప్ప, బాసర తదితర ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయం, గణేశ్ టెంపుల్, బిర్లామందిర్, జగన్నాథ్ టెంపుల్, చిలుకూరు బాలాజీ టెంపుల్, జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి, కర్మన్ఘాట్ ఆంజనేయస్వామి ఆలయాల్లో ఉదయం నుంచే భక్తులు బారులుతీరారు. ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం దేవాదాయశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని భక్తులకు పంపిణీచేశారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జానపద, కూచిపూడి, భరతనాట్య, పేరిణి కళాకారులు రవీంద్రభారతిలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతాపరుద్ర విజయం నాటకం ఆకట్టుకున్నది.