Indian Pitta | నారాయణపేట : అరుదైన వలస పక్షి నారాయణపేట ఎక్లాస్పూర్ అర్బన్పార్క్లో ప్రత్యక్షమైంది. ఈ అరుదైన పక్షిని ‘ఇండియన్ పిట్ట’గా పిలుస్తుంటారు. చాలా రంగులతో అందంగా ఉంటుంది. రాలిపోయిన ఆకుల కింద ఉండే కీటకాలను తింటూ మనుగడ కొనసాగిస్తుంది. ఇది చాలా సిగ్గరి. ఉదయం, సాయంత్రం ఆక్టివ్గా ఉంటూ వినసొంపుగా ఉండే.. ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని చేస్తుంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ మదన్ రెడ్డి ఈ పక్షిని అతి కష్టం మీద తన కెమెరాలో బంధించారు. ఈ పక్షి హిమాలయ అడవుల్లో.. మధ్య, పశ్చిమ భారతదేశంలోని కొండల్లో ఆకురాల్చే, దట్టమైన అడవుల్లో నివాసం ఉంటుంది. శీతాకాలంలో దక్షిణభారతంలోని దట్టమైన అరణ్యాలకు వలస వస్తుంటుంది.
ఈ పక్షి రంగురంగులుగా ఉండడం వల్ల దీన్ని హిందీలో ‘నవరంగ్’ అని పిలుస్తారు. నారాయణపేటలో అరుదైన పక్షి కనిపించడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని మదన్రెడ్డి తెలిపారు. ఈ పక్షి ఇక్కడ కనిపించడం నారాయణపేట అడవుల అభివృద్ధి కి నిదర్శనమని పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ వీణావాణి మాట్లాడుతూ నారాయణపేటలో ఇంకా చాలా పక్షి జాతులు, వన్య ప్రాణులు ఉన్నాయన్నారు. వాటిని అన్వేషించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఎక్లాస్పూర్ అర్బన్ పార్క్ను అభివృద్ధి చేయడంతో పాటు పక్షులకు అణువుగా ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే కాలంలో నారాయణపేటలోని వివిధ పాఠశాలల్లో బర్డ్ వాచింగ్, అడవులు, వన్య ప్రాణుల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.