.ఖైరతాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): ఓ మహిళా రైతుకు నిమ్స్లో అరుదైన ఆపరేషన్ చేసి గుండె సమస్య నుంచి విముక్తి కల్పించారు. కామారెడ్డికి చెందిన బాలమణి(56)కి ఇటీవల ఆయాసం, గుండెదడ అధికమయ్యాయి. స్థానికంగా పలు దవాఖానలలో చికిత్స చేయించుకున్నా ఫలితం కనిపించలేదు. దాంతో ఈ నెల మొదటివారంలో నిమ్స్లో చేరింది. అక్కడ జరిపిన పరీక్షల్లో గుండె కవాటం ఒకటి మూసుకుపోవడం, గుండెలోపం వల్ల నాడి ఎక్కువ వేగంతో కొట్టుకోవడం అనే జంట సమస్యతో ఆమె బాధ పడుతున్నట్టు నిర్ధారణ అయ్యింది. నిమ్స్ కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సాయిసతీశ్ బృందం ఆమెకు బెలూన్ వాల్వోటమి చేసి కవాటంలోని అడ్డంకిని తొలగించింది. రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో గుండె కొట్టుకునే వేగాన్ని 250 నుంచి 72కు తగ్గించారు. దాంతో రెండు సమస్యలూ తొలగిపోయాయి. ఇలా ఒకేసారి ఆపరేషన్ చేసి రెండు సమస్యలు పరిష్కరించడం అరుదని అంటున్నారు. ఓపెన్ హార్ట్ చికిత్స అవసరం లేకుండా కేవలం చిన్న కాటు, క్యాథటర్ల సాయంతో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకొన్నారని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని డాక్టర్ సాయిసతీశ్ తెలిపారు. లక్షలాది రూపాయలు విలువ చేసే ఈ చికిత్సను ఆరోగ్యశ్రీలో ఉచితంగా నిర్వహించామని వివరించారు. డాక్టర్ సాయిసతీశ్ బృందానికి బాలమణి కృతజ్ఞతలు చెప్పారు. ‘దేవుడిలా నన్ను కాపాడారు. నా కుటుంబం ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు.