హైదరాబాద్: రాజ్యసభ మాజీ సభ్యుడు, బీజేపీ మాజీ నాయకుడు రాపోలు ఆనందభాస్కర్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ గులాంబీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. రాపోలు వెంట పలువురు పద్మశాలీ సంఘం నాయకులు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాపోలు ఆనందభాస్కర్ను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. రాపోలు సామాజిక స్పృహ కలిగిన విద్యావేత్త అని కొనియాడారు.
చేనేత, పవర్లూమ్ కార్మికుల కోసం సీఎం కేసీఆర్ పలు పథాకాలు అమలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత రంగమేనని ఆయన పేర్కొన్నారు. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. దేశంలో చాలామంది అద్భుత ప్రతిభ ఉన్న చేనేత కళాకారులు ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో నేతన్నకు చేయూత, చేనేత లక్ష్మి పేరుతో కార్మికులను ఆదుకుంటున్నామని తెలిపారు. నేతన్నకు బీమాతో కార్మికులకు అండగా ఉంటున్నామని, చేనేత కళాకారులకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు.