హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీస్ అంటే.. దోపిడీ ముఠాల్లో భయం పోయిందా? ఇటువైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే ముఠాలు ఇప్పుడు యథేచ్ఛగా తిష్టవేశాయా? భయంకరమైన దోపిడీ ముఠాలపై ఇంటెలిజెన్స్కు ఏమాత్రం సమాచారం లేదా? అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. పట్టపగలే తుపాకులతో, మారణాయుధాలతో తిరుగుతూ.. దోపిడీలకు పాల్పడుతున్నా వ్యవస్థ మొద్దునిద్ర వీడటం లేదు. గత డిసెంబర్ 30న పోలీసుశాఖ విడుదల చేసిన వార్షిక క్రైమ్ నివేదిక ప్రకారం రోజుకు 53 దొంగతనాలు ఎక్కడో ఓ చోట జరుగుతున్నాయి. తలుపులు బద్దలు కొట్టి/ఇంట్లోకి చొరబడి చేసే దొంగతనాలు రోజుకు 18 నమోదవుతున్నాయి. ఇక బందిపోటు దొంగతనాలు దాదాపు 24శాతం పెరిగాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా.. ఆ ముఠాలను భయపెట్టే చర్యలు తీసుకోవడంలో వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది.
పట్టపగలే కాల్పులకు తెగబడుతూ..
తెలంగాణలో దోపిడీలు, దొంగతనాలు, చోరీల కేసులు భారీగా నమోదవుతున్నట్టు పోలీసుల లెక్కలు చెప్తున్నాయి. ఉన్నోళ్లు, పేదోళ్లు, వృద్ధులు అనే తేడా లేదు.. గుడి, బడి, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ ఆఫీసులు, ఇండ్లు అనే భేదం లేదు.. ఏదైనా సరే అందినకాడికి దొంగలు దోచుకుంటున్నారు. పట్టపగలే తాళాలు పగులగొట్టి ఇండ్లలోకి దూరి చోరీలు చేస్తున్నారు. హైదరాబాద్లో నిరుడు ఖజానా జ్యువెలర్స్లో సైతం కాల్పులకు తెగబడి బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. ఆ రోజు ఉదయమే మరో ఘటనలో కూకట్పల్లిలో బంగారం, నగదు దోచుకెళ్లారు. తాజాగా కరీంనగర్ పట్టణంలో పీఎంజే జ్యువెలరీలో కూడా సిబ్బందిపై కాల్పులు జరిపి మరీ బంగారం, వెండి, ఇతర ఆభరణాలు కొల్లగొట్టారు. కొన్నిచోట్ల మారణాయుధాలతో దాడిచేసి దోచుకుంటున్నారు. ఇంతలా భయపెట్టి, చంపేందుకు కూడా వెనుకాడని దోపిడీ గ్యాంగ్లు తెలంగాణలో తిష్టవేసినా.. హోంమంత్రిత్వ శాఖను చూస్తున్న ముఖ్యమంత్రికి పట్టడం లేదని విమర్శలొస్తున్నాయి.
ఇంటెలిజెన్స్కు సమాచారం శూన్యం
రాష్ట్రంలో ఎక్కడ చోరీ జరిగినా లక్షలాది రూపాయలు నష్టపోవడమే కాకుండా.. విలువైన బంగారం, ఆభరణాలు, వస్తువులను కోల్పోతున్నారు. చోరీల కోసమే అంతరాష్ట్ర ముఠాలు తెలంగాణ సరిహద్దుల్లో తిష్టవేసినట్టు తెలుస్తున్నది. ఈ దోపిడీ గ్యాంగ్ల రాకపట్ల ఇంటెలిజెన్స్కు సమాచారం లేదని తెలుస్తున్నది. దొంగతనం, దోపిడీలు జరిగిన తర్వాత దర్యాప్తులు చేపడుతున్నారే తప్ప ఆయా ముఠాలపై నిఘా పెట్టడం, తెలంగాణవైపు రాకుండా భయపెట్టడం, ఎస్పీలు, కమిషనర్లను, వారి ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడంలో వ్యవస్థ విఫలమవుతున్నది. గతంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో దోపిడీ, పార్థీ, భవేరియా ముఠాలు తెలంగాణవైపు రాకుండా నిలువరించారు. 2020లో 8,330 దొంతనాలు జరిగితే.. 2024కు ఆ సంఖ్య 19,480కి పెరిగింది. ఇండ్లలో దోపిడీలు 2020లో 3,476 జరిగితే.. 2024 నాటికి 5,724కు చేరాయి. భారీ దోపిడీలు 2020లో 305 నమోదైతే 2024కు ఆ సంఖ్య 703కు చేరింది. గతంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంది.. పోలీసులు కూడా ఎంత చురుగ్గా స్పందించేవారు అనడానికి ఈ లెక్కలే నిదర్శనాలు.
ఇటీవల సంచలనం సృష్టించిన దోపిడీ కేసులివే..
2025 వార్షిక క్రైమ్ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితి