భద్రాచలం, మే 8: భద్రాచలం దివ్యక్షేత్రంలో ఆదివారం జగదభిరాముడి పట్టాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి రోజు శ్రీరామ పునర్వసు దీక్ష తీసుకొన్న భక్తులు శనివారం దీక్ష విరమణ చేశారు. ఆదివారం పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారి నిత్య కల్యాణం పూర్తయిన తర్వాత అదే వేదికపై పట్టాభిషేకం జరిపారు. భక్త రామదాసు తయారు చేయించిన దివ్యాభరణాలను రామయ్యకు, సీతమ్మకు, లక్ష్మణస్వామికి ధరింపజేశారు. శ్రీరామచంద్రుడికి స్వర్ణ పాదుకలు, స్వర్ణ ఛత్రం, రాజముద్ర, రాజదండం, స్వర్ణ కిరీటం, డాలు, కత్తి, రత్నాభరణాలను ధరింపజేశారు.