హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలోని రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 24 గంటల్లోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. జిల్లాలో ఇప్పటికే మెదక్తోపాటు, తూప్రాన్ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని స్థానికులు ఎన్నో రోజులుగా విజ్ఞప్తిచేస్తూ వస్తున్నారు. బుధవారం జరిగిన మెదక్ బహిరంగసభలోనూ ఇదే అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి మరోసారి తీసుకెళ్లారు. ఆమె కోరిక మేరకు ముఖ్యమంత్రి సానుకూల ప్రకటన చేశారు. ఈ మేరకు రామాయంపేట, నిజాంపేట, శంకరంపేట (ఆర్), నార్సింగి మండలాలను కలిపి రామాయంపేట రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై అధికారులు చర్యలు చేపట్టాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే ప్రజలు 15 రోజుల్లోగా అధికారులకు వెల్లడించాలని నోటిఫికేషన్లో సూచించారు.