హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : ఆడబిడ్డలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అంటూ సర్కార్ గొప్పలు చెప్తున్నది. ఏడాదిపాటు ఉచితంగా ప్రయాణించారని, రాఖీ రోజు బాకీలు వసూలు చేస్తున్నది. రాఖీ పండుగకు 5 వేల స్పెషల్ బస్సులు నడుపుతున్నామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఆడబిడ్డలను, అన్నదమ్ముళ్లను లక్ష్యంగా చేసుకొని ముక్కుపిండి మరీ అదనపు వసూళ్లు చేపట్టిందని ప్రయాణికులు వాపోతున్నారు. పండుగల రద్దీకి అనుగుణంగా బస్సులు తిప్పకుండా ఇష్టానుసారంగా స్పెషల్ బస్సుల పేరుతో చార్జీలు పెంచి, జేబులు గుల్ల చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కండక్టర్లకు టార్గెట్లు పెట్టి అవి చేరుకోలేకపోతున్నారని వేధిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం రాఖీ పండుగ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నది. చాలాప్రాంతాల్లో పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డులు తగిలించి ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేశారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్కు సాధారణ రోజుల్లో రూ. 290 ధర ఉంటే రాఖీ పండుగ, 1:50 రూల్ పేరుతో అదనంగా రూ.100 నుంచి రూ.150 వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్కు మెట్రో డీలక్స్ స్పెషల్ బస్లో రూ.400 వరకు వసూలు చేశారని పేర్కొన్నారు. ఇదే తరహా దోపిడీ సూపర్ లగ్జరీ బస్సుల్లోనూ కొనసాగిందని ప్రయాణికులు మండిపడ్డారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లో ప్రయాణికులకు కనిపించేలా ‘స్పెషల్ బస్సు’ అని బోర్డులు పెట్టాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశించినా కొందరు డ్రైవర్లు, కండక్టర్లు వాటిని పాటించలేదని ప్రయాణికులు చెప్తున్నారు. ప్రయాణికులు బస్సు ఎకిన తర్వాత దారిమధ్యలో ‘ఇది స్పెషల్ బస్సు.. దీనికి ఎక్కువ చార్జీలు అవుతాయి’ అంటూ కండక్టర్లు వసూలు చేశారని వాపోతున్నారు. నారెట్పల్లి నుంచి సూర్యాపేట సాధారణ రోజుల్లో టికెట్ రూ.80 ఉంటే రూ.140 చేశారని అంటున్నారు. ఉప్పల్ నుంచి హనుమకొండ వైపు సాధారణ రోజుల్లో టికెట్ రూ. 340 ఉంటే.. రూ.440కి పెంచారని, మెదక్ నుంచి నర్సాపూర్ రూ.70 ఉంటే.. రూ.100 చేశారని, సాధారణంగా ఉన్న బస్సులకే పండగపూట స్పెషల్ బస్సు బోర్డులు పెట్టి ప్రయాణికులను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఖీ వేళ ఆర్టీసీ చార్జీల పెంపుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం చేస్తుండటానికి మరో ప్రధాన కారణం పూటపూటకు చార్జీలు పెంచడమే. నాగర్కర్నూల్ – మహబూబ్నగర్ పల్లెవెలుగు బస్సులో ఉదయం రూ. 60 ఉన్న చార్జీ మధ్యాహ్నానికి రూ.80కి పెంచారని టిక్కెట్లతో సహా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అకారణంగా కొన్నిచోట్ల బస్ చార్జీలు పెంచడంతో డబ్బులు సరిపోక హాస్టల్ విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని తెలిసింది. అదనపు చార్జీ చెల్లించలేక కొందరు విద్యార్థులు మార్గమధ్యంలోనే బస్సు దిగి నడుచుకుంటూ వెళ్లారని ప్రయాణికులు చెప్తున్నారు.
స్పెషల్ బస్సుల్లో జర్నలిస్టులకు 1/3 బస్ టికెట్ వర్తించలేదని పలువురు చెప్తున్నారు. స్పెషల్ బస్సుల్లోని సిబ్బందికి ఇచ్చే టిమ్లలో 1/3 ఆప్షన్ చూపించడం లేదని చెప్పి జర్నలిస్టుల నుంచి స్పెషల్ ఫెయిర్ వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ రాఖీ దృష్ట్యా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినా వాటిల్లోనూ సీట్లు దొరుకక మహిళలు, పురుషులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ సాధారణ బస్సులు, స్పెషల్ బస్సులు సరిపోక ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయించారు. తిరుగుప్రయాణంలోనైనా జేబులు గుల్ల చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజ లు కోరుతున్నారు.