జనగామ చౌరస్తా, మే 27: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి ఘనవిజయం సాధిస్తారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ స్కూల్ పోలింగ్ బూత్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నిరుద్యోగులు, పట్టభద్రులు విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. ఆరునెలల కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారెంటీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు, మెగా డీఎస్సీ హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. క్లీన్ ఇమేజ్ ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని పట్టభద్రులంతా కలిసి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే నాలుగుసార్లు ఘన విజయం సాధించిన బీఆర్ఎస్ పట్టభద్రులు, నిరుద్యోగులు, మేధావుల మద్దతుతో ఐదోసారి గెలుపొందడం ఖాయమైందని పేర్కొన్నారు.