న్యూఢిల్లీ, జూన్ 10: నాలుగు రాష్ర్టాల్లో 16 స్థానాలకు గురువారం రాజ్యసభ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. కడపటి వార్తలు అందే సమయానికి రాజస్థాన్, కర్ణాటకలోని ఎనిమిది స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు మాత్రమే వెలువడ్డాయి. రాజస్థాన్లో అధికార కాంగ్రెస్ మూడు స్థానాలను గెలుచుకోగా, బీజేపీకి ఒక సీటు దక్కింది. బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన జీ మీడియా గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్రకు ఓటమి ఎదురైంది. కర్ణాటకలో అధికార బీజేపీకి మూడు స్థానాలు లభించగా, కాంగ్రెస్ ఒక సీటును గెలుచుకున్నది. జేడీఎస్ ఒక్క సీటును కూడా గెలువలేకపోయింది. ఓటింగ్ నిబంధనలను ఉల్లంఘించారన్న విపక్షాల ఆరోపణలతో మహారాష్ట్రలోని ఆరు స్థానాలకు, హర్యానాలోని రెండు స్థానాలకు ఓట్ల లెక్కింపును నిలిపేశారు. దేశవ్యాప్తంగా 15 రాష్ర్టాల పరిధిలో 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు గానూ 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 16 స్థానాలకు తాజాగా ఎన్నికలు జరిగాయి.
విజేతలు వీరే
రాజస్థాన్: రణ్దీప్ సూర్జేవాలా (కాంగ్రెస్), ముకుల్ వాస్నిక్ (కాంగ్రెస్), ప్రమోద్ తివారీ (కాంగ్రెస్), ఘన్శ్యామ్ తివారీ (బీజేపీ).
కర్ణాటక: నిర్మలా సీతారామన్ (బీజేపీ), లహర్ సింగ్ సిరోయా (బీజేపీ), జగ్గీశ్ (బీజేపీ), జైరాం రమేశ్ (కాంగ్రెస్).