హైదరాబాద్ : దానం నాగేందర్కు(Danam Nagender) ఎంపీ టికెట్ కేటాయించడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన మరోనేత దానంకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేయడం దుమారం రేపుతున్నది.కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దానం నాగేందర్కు ఇవ్వడంపై కాంగ్రెస్ నేత రాజు యాదవ్(Raju Yadav) దానంపై విమర్శలు గుప్పించారు. బలమైన నేత అనుకుని టికెట్ ఇచ్చారు.
నా దృష్టిలో ఆయన బలమైన నేత కాదు అని ఆరోపించారు. పార్టీలు మారి వచ్చిన నేత రేపు గెలిస్తే పార్టీ మారడు అని గ్యారంటీ లేదన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీ టికెట్ ఎలా తీసు కుంటాడు? కాంగ్రెస్ హై కమాండ్ టికెట్ ఇచ్చింది కాబట్టి మేము వ్యతిరేకించడం లేదన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలని డిమాండ్ చేశారు. దానంపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ ముందు స్పీకర్ కి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
ఆయన చర్య తీసుకోలేదు కాబట్టి హైకోర్టులో(High Court) రిట్ పిటిషన్ దాఖలు చేశానని రాజు యాదవ్ తెలిపారు. దానం నాగేందర్ ఇలా పోటీ చేస్తే గెలవడు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తే గెలుస్తాడని చెప్పారు. దానం కోవర్ట్ కాదు అనిపించుకోవాలి అంటే ఆయన రాజీనామా చేసి పోటీ చేయాలి. లేందంటే దానం నాగేందర్ను మేము కోవర్టుగా భావిస్తామన్నారు.