పెద్దపల్లి, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రోజువారీ విధుల్లో భాగంగా పనిలో నిమగ్నమైన ముగ్గురు కార్మికులు రైలు ప్రమాదంలో మృతి చెందారు. ఈ దారుణ సంఘటన పెద్దపల్లి జిల్లా చీకురాయిలో మంగళవారం చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా చీకురాయి-కొత్తపల్లి గ్రామాల మధ్యలో రైల్వే ట్రాక్పై ఒక రైల్వే ఉద్యోగి, మరో ముగ్గురు రోజువారీ కూలీలు మరమ్మతు పనులు చేస్తున్నారు.
రామగుండం రైల్వేక్వార్టర్స్లో ఉండే కే దుర్గయ్య అనే రైల్వే గ్యాంగ్మేట్, పెద్ద కల్వల గ్రామానికి చెందిన పెగడ శ్రీనివాస్, సుల్తానాబాద్కు చెందిన కాంపెల్లి వేణు, ఊదర శ్రీనివాస్ అనే ముగ్గురు దినసరి కూలీలు రైల్వే ట్రాక్లకు గ్రీజు పూస్తూ తమ పనిలో నిమగ్నమయ్యారు. పక్కట్రాక్ పైనుంచి గూడ్స్ రైలు వెళ్తుండటంతో ఆ శబ్దానికి వీరు పనిచేస్తున్న ట్రాక్పై నుంచి వస్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రాకను వాళ్లు గుర్తించలేదు.
వాయువేగంతో వచ్చిన రైలు వీరు ముగ్గురిని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రా ణాలు కోల్పోయారు. ఈ ముగ్గురి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మరో కార్మికుడు ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డాడు. సంఘటన స్థలానికి రైల్వే పోలీసులు, పోలీసులు చేరుకుని వివరాలు సేకరించి, మృతదేహాలను మార్చురీకి తరలించారు.