కరీంనగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్నట్టుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారం. రెండురోజులుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ‘ఎవరేమనుకుంటే నాకేంది..’ అనే ధోరణి కనిపిస్తున్నది. ఓ వైపు మతకలహాల గురించి ఆయన కరీంనగర్ దీక్షావేదికపై మాట్లాడిన మాటలు వీడియోలో రికార్డయ్యి సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలకు దారితీస్తుంటే.. ఆయన మాత్రం అల్లర్లకు టీఆర్ఎస్ కారణమంటూ మాట్లాడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో హైదరాబాద్ పాతనగరంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. దేశవ్యాప్తంగానూ నిరసనలు వెల్లువెత్తాయి.
నష్టనివారణలో భాగంగా రాజాసింగ్ను బీజేపీ సస్పెండ్ చేయక తప్పలేదు. అయితే విద్వేష వ్యాఖ్యలు చేసినందునే రాజాసింగ్ను బీజేపీ సస్పెండ్ చేసిన విషయం తెలియదన్నట్టు నటిస్తూ.. ముఖ్యమంత్రిపై నెపం నెట్టేందుకు బండి సంజయ్ విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం ఉదయం కరీంనగర్లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన బండి.. ముఖ్యమంత్రి కేసీఆర్ మతవిద్వేషాలను రగిలించి, బీజేపీపైకి వాటిని నెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. తాము అభివృద్ధిపై మాట్లాడుతుంటే.. మతతత్వ పార్టీ అంటూ విద్వేషాలు రగిలిస్తారా? అంటూ ఎక్కడేని అమాయకత్వాన్ని ప్రదర్శించారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మత ఉద్రిక్తతలకు కారకుడైన ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన పార్టీయే.. టీఆర్ఎస్పైకి ఆ నెపాన్ని నెట్టేందుకు ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
దాసోజు శ్రవణ్తో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి మత ఘర్షణల గురించి తానేదో చర్చించినట్టుగా టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నాయని బండి సంజయ్ చెబుతున్నారు. తాను మత ఘర్షణల గురించి మాట్లాడలేదని ఆయన నమ్మబలికే ప్రయత్నం చేశారు. దమ్ముంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తన మాటల పూర్తి వీడియోను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తాను మాట్లాడిన అసలు మాటలేందో తేటతెల్లం చేసేలా ఆయనే పూర్తి వీడియో బయటపెట్టకుండా.. ఆ పని టీఆర్ఎస్, కాంగ్రెస్ చేయాలనడంపై సోషల్మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.