రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (డీపీఆర్వో)ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సందీప్కుమార్ఝా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారుల గ్రూపులో ఓ కార్టూన్ను పోస్టు చేసిన విషయం వివాదాస్పదం కావడమే ఈ సస్పెండ్కు కారణమైంది. ‘డియర్ విప్ ఆది శ్రీనివాస్ గారు.. సీఎం నా పనితనాన్ని గుర్తించాడు.
నేనిక్కడే ఉంటా.. అవినీతి అక్రమార్కుల భరతం పడుతా.. పైరవీలు నన్ను తొలగించలేవు’ అని పేర్కొంటూ చిత్రీకరించిన ఓ కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యిం ది. కాగా, ఆ కార్టూన్ను రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారుల గ్రూపులో డీపీఆర్వో శ్రీధర్ స్వయంగా పోస్టు చేయడం వివాదాస్పదమైంది.
ఇది అన్ని గ్రూపుల్లో వైరల్గా మారడంతో కలెక్టర్ దృష్టికి వెళ్లింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కలెక్టర్ సందీప్కుమార్ఝా.. డీపీఆర్వోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి అసంబద్ధ కార్టూన్ను పోస్టు చేయడం నిబంధనలకు పూర్తి విరుద్ధమని, అలాగే మరి కొన్ని కారణాలను సస్పెన్షన్ లేఖలో పేర్కొన్నారు. డీపీఆర్వో సస్పెండ్ కావడం జిల్లాలో కలకలం రేపుతున్నది.