హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ‘బీజేపీది బలుపు కాదు.. వాపు’ అని సీఎం కేసీఆర్ పదేపదే చెప్పిందే నిజమైంది. ‘బీజేపీది పాల పొంగులాంటి ఎమోషన్’ అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమని మునుగోడు రుజువు చేసింది. మీడియాలో, సోషల్ మీడియాలో హడావిడి తప్పా ఆ పార్టీ కి క్షేత్రస్థాయిలో క్యాడర్ లేదని అర్థమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మునుగోడులో 10వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం ఓట్లలో ఇది 4 శాతం కంటే తక్కువ. అందుకే ప్రచారంలో రాజగోపాల్రెడ్డి బీజేపీని నమ్ముకోలేదు. బీజేపీ గురించి, మోదీ గురిం చి చెప్పుకోలేదు.
మోదీ పేరెత్తితే పెరిగిన పెట్రో ల్, గ్యాస్ సిలిండర్ ధరలు గుర్తుకు వస్తాయని గ్రహించారు. ప్రచారంలో పలు చోట్ల ఆ సెగ తగిలింది. దీంతో సొంత ఇమేజ్తోనే పోరాడారు. మరోవైపు అన్న వెంకట్రెడ్డి కూడా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు ఫోన్ చేసి తమ్ముడికి ఓటేయాలని కోరారు. అన్ని మండలాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలను ప్రలోభపెట్టి బీజేపీలో చేర్చుకొన్నారు. ఫలితంగా పోలింగ్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. రాజగోపాల్రెడ్డికి వచ్చిన ఓట్లన్నీ బీజేపీవి కాదని విశ్లేషకులు చెప్తున్నారు.