హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాజగోపాల్ని బీజేపీ బకరాని చేసిందా? పాము-నిచ్చెనల ఆటలో పావుగా మార్చిందా? బలవంతంగా రాజీనామా చేయించి, బలిచేసిందా?.. కమల్ ఫైల్స్ కుతంత్రపు లోపలి కోణాలు అదే నిజమని చెప్తున్నాయి. బీజేపీ కుట్రలో రాజగోపాల్రెడ్డి చిన్నపావు మాత్రమేనని.. రామచంద్రభారతి, సింహయాజి, నందుకుమార్ మధ్య జరిగిన సంభాషణల్లోనూ స్పష్టమైనట్టు దర్యాప్తు వర్గాలు చెప్తున్నాయి. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. తెలంగాణలో భారీ రాజకీయ కుట్రకు తెరలేపేందుకు చూస్తున్న తరుణంలో బీజేపీకి అందివచ్చిన అవకాశంగా రాజగోపాల్రెడ్డి కనిపించారు. రాజగోపాల్ బీజేపీని సంప్రదించగానే, బకరా దొరికిందని సంబురపడింది. బీజేపీ ప్రణాళిక మొత్తం.. పాపం రాజగోపాల్రెడ్డికి తెలియదు. కాంగ్రెస్ నుంచి బయటపడాలి.. బీజేపీలో చేరి 4 కాంట్రాక్టులు చేసుకోవాలన్న ఆశతోనే బీజేపీలో చేరాలనుకున్నారు. కానీ, ఆయనను వైకుంఠపాళిలోకి లాగిన బీజేపీ.. ఏకంగా పెద్దపాముకే బలిపెట్టింది. ఉన్న సీటునూ కోల్పోయేలా చేసి, ఇంట్లో కూర్చోబెట్టింది.
రాజకీయ అస్థిరత కోసమే రాజీనామా
బీజేపీ పన్నాగంలో రాజగోపాల్రెడ్డి ఒక పావు మాత్రమేనన్నది రామచంద్ర భారతి, సింహయాజి, నందుకుమార్ మధ్య జరిగిన సంభాషణల్లోనూ బయటపడింది. రాజగోపాల్రెడ్డి కోసం మునుగోడు ఉపఎన్నికను తీసుకువచ్చి.. ఆ ఎన్నికల్లో ధనప్రవాహాన్ని పారించి పార్టీని గెలిపించడం ద్వారా.. తెలంగాణలో రాజకీయ అస్థిరతను సృష్టించాలన్నది బీజేపీ ప్లాన్గా తెలుస్తున్నది. ఈ ఉపఎన్నికల క్రమంలోనే ఒకరిద్దరు అధికారపార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే.. అటు మునుగోడు ఉపఎన్నికకు ఉపయోగపడుతుందని, ఇటు అధికార టీఆర్ఎస్పై ఒత్తిడిపెరిగి ప్రభుత్వం కూలిపోతుందని ఆ పార్టీ అగ్రనేత అమిత్షా అంచనా వేసినట్టు తెలుస్తున్నది.
అయితే, బీజేపీ అనుకున్నదొక్కటి.. మునుగోడులో అయ్యిందొక్కటి. మునుగోడు ప్రజలు తిన్న రేవును మరువలేదు. ప్రశాంత నల్లగొండ జిల్లాలోకి బీజేపీ రాకను ఏమాత్రం సహించబోమని బలమైన సంకేతం ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి, ఉద్యమ రథసారథి కేసీఆర్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. టీఆర్ఎస్కే పట్టం కట్టారు. సీఎం కేసీఆర్కు ఉన్న ప్రజాభిమానం ముందు రాజగోపాల్రెడ్డి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి పోయిందేమీలేదు.. రాజగోపాల్రెడ్డి రాజకీయ జీవితం మాత్రం రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఆట ముగిసినతర్వాత పక్కనపడేసిన పావులా ఆయన మిగిలిపోయారు. రాజగోపాల్రెడ్డి తనను తాను అతిగా ఊహించుకొని బొక్కబోర్లా పడ్డాడని ఇప్పుడు బీజేపీ సీనియర్లే అంటున్నారు. తనను మించిన వాడేలేడన్నట్టుగా వ్యవహరించాడని, రాజకీయ అపరిపక్వతతో రాజగోపాల్ బీజేపీ కుట్రలకు బలయ్యాడని చెప్పుకుంటున్నారు. చివరకు ఉన్న సీటునూ కోల్పోయి, రాజీ పడిన మాజీగా ఆయన మిగిలాడన్నది వాస్తవం.
‘నో’.. అన్న నోటితోనే..
రాజగోపాల్రెడ్డిని తన రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకోవాలని భావించిన బీజేపీ.. తక్షణమే ఆయనకు కండువా మెడలో వేసి పార్టీలోకి లాగింది. బీజేపీలో చేరుతా కానీ.. ఇప్పుడే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేనని రాజగోపాల్రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. ‘మరో ఏడాదిలో ఎన్నికలు ఎలాగూ వస్తాయి కదా.. అప్పటివరకు బీజేపీలోనే ఉంటాను. ఒకవేళ కాంగ్రెస్ ఫిర్యాదు చేసి.. స్పీకర్ అనర్హత వేటు వేస్తే హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటా..’ అని వాదించారు.. కానీ, బీజేపీ మాస్టర్మైండ్ దానికి ఒప్పుకోలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్షా రాజగోపాల్రెడ్డిని రాజీనామాకు ఒప్పించారు. ఎన్నికలకు అవసరమైన డబ్బు తామే పంపిస్తామని, ఎన్ని కోట్లయినా ఫర్వాలేదు.. పోటీచేయాలని తేల్చిచెప్పారు. అమిత్షా అంతటివాడే అంత బలంగా హామీ ఇవ్వడంతో రాజగోపాల్రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఇదంతా అమిత్షా సమక్షంలోనే జరిగింది. బీజేపీ కుట్రను పూర్తిగా అర్థం చేసుకోలేని రాజగోపాల్.. తన రాజకీయజీవితాన్ని పణంగా పెట్టారు.