హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉపఎన్నికల్లో డబ్బులు పంచి పెట్టి, ఉనికి కాపాడుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు. సోమవారం మునుగోడు మండలం చల్మెడ చౌరస్తా వద్ద కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్ భర్త కోటి రూపాయల నగదు తరలిస్తూ పట్టుబడటంపై ఆ పార్టీ నాయకుల్లో గుబులు మొదలైంది. ఇప్పటివరకు గుట్టుచప్పుడు కాకుండా చేసే ‘కోట్ల’ నగదు రవాణా ఎలా లీకైందనే దానిపై బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి మల్లగుల్లాలు పడుతున్నారు. ‘నేనింతకాలం ఏం చేసినా ఎవనికీ తెల్వకపోయేది..? ఇది తెలిసిందంటే మనలోనే ఎవరో పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. వాడెవడో దొరకాలె.. కొడుకలను’ అంటూ పరుషపదజాలంతో మంగళవారం తన అంతరింగక నాయకులపై చిందులేసినట్టు తెలుస్తున్నది. ‘నా పైసలు తింటూ నన్నే మోసం చేస్తారా? ఎన్నికలు అయిపోగానే ఒక్కొక్కని తోలుతీస్తా’నని చిందులు తొక్కినట్టు బీజేపీ శిబిరంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మునుగోడులో బీజేపీపై ఆశలు పెట్టుకొన్న వారిపనా? హైదరాబాద్ నుంచి వచ్చిన నాయకుల పనా? లేదంటే తాను బీజేపీలోకి రావటాన్ని ఇష్టపడని వర్గం చేసిన పనా? అని ఆయన ఆరా తీస్తున్నట్టు సమాచారం. బీజేపీలో ఒక వర్గం తనను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నదని, తాను పార్టీలో చేరడాన్ని ఆ వర్గం జీర్ణించుకోలేక తన ప్రచార వ్యూహాలను బయటకు చేరవేస్తున్నట్టు రాజగోపాల్రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాజగోపాల్రెడ్డి మునుగోడులోని తన సన్నిహితులు, నమ్మకస్తుల ఇండ్లల్లో.. పోల్ మేనేజ్మెంట్ కోసం పాతరేసిన ‘డంప్’లపై ఆయన సన్నిహితుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నట్టు సమాచారం. అత్యంత రహస్యంగా తరలించిన రూ.కోటి నగదు చల్మెడలో పట్టుబడటం, ఆ పట్టుబడ్డ వ్యక్తి బండి సంజయ్, ఈటల రాజేందర్కు సన్నిహితుడు కావడం.. ఆ నగదును పార్టీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ ఆదేశాల మేరకు తరలిస్తున్నానని పోలీసులకు వెల్లడించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి ఈటల, సంజయ్ మధ్య సఖ్యత లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
తన సమాచారం లీక్ కాకుండా రాజగోపాల్రెడ్డి ‘ముందుజాగ్రత్త’ చర్యలు తీసుకొంటున్నారు. ప్రచారానికి వచ్చిన ఓ స్థాయి నేతలంతా ఒకే దగ్గర బస చేస్తే అందరిపైనా నిఘా ఉంచడం సులువు అవుతుందని భావనతో మునుగోడు శివారులో 2 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక క్యాంపు కార్యాలయం నిర్మించుకొన్నారు. దాని ఆవరణలోనే నాయకులకు బస ఏర్పాటు చేస్తే తన నమ్మకస్తులు, బంధువుల కనుసన్నల్లోనే ఉండొచ్చని ప్లాన్ చేసి అందరికీ ఆగమేఘాల మీద బస ఏర్పాట్లు చేస్తున్నారు. తన నిర్మాణ సంస్థ సిబ్బందితో ఈ గుడారాలను నిర్మిస్తున్నారని పార్టీలో జోరుగా చర్చ సాగుతున్నది.