హైదరాబాద్ : నగరంలో సోమవారం రాత్రి పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తున్నది. మేడ్చల్ జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, గండిమైసమ్మ, గాజులరామారం, షాపూర్, కుశాయిగూడ, చర్లపల్లి, నాగారం, దమ్మాయిగూడలో వర్షం కురిసింది. అలాగే కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, హైదర్నగర్, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్లో వర్షం కురువగా.. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఒక్కసారిగా వర్షం కురవడంతో వాహనదారులకు ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఇదిలా ఉండగా.. ఇవాళ తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణశాఖ తెలిపింది. రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడింది. ఉక్కపోత, వేడి నుంచి జనానికి ఉపశమనం కలిగింది. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో పలు చోట్ల రాబోయే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదవుతుందని వాతావరణశాఖ పేర్కొంది.