కడుపునిండా నీళ్లను మోసుకొని మబ్బులు రాష్ర్టానికి వచ్చేశాయ్. భూతల్లిని సల్లంగుంచటానికి, చెరువులు, కుంటలు, వాగులు, నదులను నిండుకుండలా మార్చటానికి ‘నైరుతి’ పవనవేగంతో వచ్చేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలకరి జల్లులను కురిపించి, రుతురాగాన్ని ఆలపించింది. ఖరీఫ్కు కాలు కదపాలని సంకేతమిచ్చింది. ఇంకేం.. నేలమ్మ పులకరించింది.. రైతన్న మోము చిగురించింది.
నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, జూన్ 5: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. నైరుతి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, నెల్లూరు, చిత్తూ రు, తిరుపతి మీదుగా రుతుపవనాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోకి శనివారం ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేం ద్రం ప్రకటించింది.
నైరుతి గాలులు బలంగా వీస్తున్నందున రాబో యే 48గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఒకటి రెండు చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. ఈనెల 3న కేరళ తీరం తాకిన నైరుతి రుతుపవనాలు బలంగా ముందుకు కదులుతున్నాయి. రుతుపవనాలు ఏపీలోని రాయలసీమ కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించాయి. అవి ముందుకు కదిలి దక్షిణ తెలంగాణను తాకాయి. మరికొన్ని గంటలలో రుతుపవనాలు పలు జిల్లాలకు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల దక్షిణ తెలంగాణతో ఈశాన్య, ఉత్తర జిల్లాలోని పాటు పలు ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు.
జుక్కల్లో 12 సెంటీమీటర్ల వర్షం
గత 24గంటల్లో కామారెడ్డి జుక్కల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. జుక్కల్లో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. యాదాద్రి-భువనగిరి, నిజామాబాద్, సంగారెడ్డి, పోచంపల్లి, పిట్లం, నారాయణ్ఖేఢ్, భీమ్గల్లో 7 సెంటీమీటర్ల నుంచి 9సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు పడిపోయి చల్లని వాతావరణం ఏర్పడింది. రామగుండం, భద్రాచలంలో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.