హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కోటిపల్లి, దుడ్యాలల్లో 10 సెంటీ మీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది. ధావలాపూర్లో 9, మదనపల్లి, ధరూర్, పుట్టపహడ్, యాలాల్ మండలం తాండూర్(ఏ) ఏ ఆర్ఎస్, రంగారెడ్డి జిల్లా కాసులబాద్లలో 6 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 22 జిల్లాల్లో వాన కురిసింది.
ఇదిలా ఉండగా.. శనివారం ఉదయం వరకు కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, నారాయణపేట, మహబూబ్నగర్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వాతావరణం కాస్త చల్లబడింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ ఆరేబియా సముద్రం, మాల్దీవుల దక్షిణ భాగాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగుతున్నాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం దక్షిణ ఇంటీరియర్ కర్నాటక పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఉందని పేర్కొన్నది.
అలాగే ఉత్తర దక్షిణ ద్రోణి ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ అంతర్గత కర్నాటక మీద ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు బలపడిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో వాతావరణం క్రమంగా చల్లబడుతున్నది. శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు 16 జిల్లాల్లో 40 డిగ్రీలపైన నమోదు కాగా, ఆరు జిల్లాల్లో 39 డిగ్రీలపైన నమోదయ్యాయి. కాగా జోగులాంబ గద్వాల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా 30 డిగ్రీలకుపైగా రికార్డయ్యాయి.