Congress | హైదరాబాద్, నవంబర్ 26(నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతలకు వరుసగా పరాభవాలు ఎదురువుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, ఖర్గే, సిద్ధరామయ్య ఎవరొచ్చినా ప్రజలు డోంట్కేర్ అంటున్నారు. సభలన్నీ జనంలేక వెలవెలబోతున్నాయి. వారి ప్రసంగాలను పెడచెవిన పెడుతున్నారు. ఆదివారం రాహుల్గాంధీ కామారెడ్డి, అందోల్, సంగారెడ్డిలో నిర్వహించిన సభలు ఫ్లాప్ సినిమాను తలపించాయి. అందోల్ సభలో జనం వచ్చినా జనాల కన్నా కుర్చీలు అధికంగా ఉన్నాయి. లారీల్లో తీసుకొచ్చిన కుర్చీలను కిందికి దింపాల్సిన అవసరం రాలేదు.
రాహుల్ హిందీ ప్రసంగం ఎవరికీ అర్థంకాక తలలు పట్టుకున్నారు. అద్దంకి దయాకర్ తెలుగు అనువాదం గందరగోళంగా ఉండడంతో రాహుల్ ప్రసంగిస్తుండగానే ప్రజలు ఇంటిముఖం పట్టారు. గమనించిన రాహుల్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి దయాకర్ అనువాదంపై అసహనం వ్యక్తం చేశారు. మక్తల్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు విచిత్ర అనుభవం ఎదురైంది. ఆయన కార్నర్ మీటింగ్కు జనాలు రాలేదు. వచ్చిన వారు కూడా ఆయన ప్రసంగిస్తుండగానే వెళ్లిపోవడం ప్రారంభించారు. వెళ్లిపోతున్న వారిని ఆపేందుకు ప్రయత్నించినా లాభం లేకపోవడంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు.