హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 8, 9 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. హైదరాబాద్లో మంగళవారం బీసీ సంఘం మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ, రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో బీసీలు పాల్గొంటారని వెల్లడించారు. మహాసభలో పలు తీర్మానాలను ఆమోదించారు. జాతీయ బీసీ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ రాజ్కుమార్, నందగోపాల్, పీ సుధాకర్, అంజి, బీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.